Overfed: ఆమెకు జంతువులను పెంచుకోవడం ఇష్టం. పెంపుడు జంతువులతో గడుపుతూ తన ఒత్తిడిని తగ్గించుకునేది. ఆమె ఓ కుక్కను పెంచుకుంది. దానికి నగి అనే పేరు పెట్టుకుంది. ఆ కుక్కను ప్రేమగా పెంచుకోవాలనే ఆలోచనలో కడుపు నిండా ఫుడ్ పెట్టాలని అనుకుంది. ప్రతి రోజూ దానికి చికెన్ పెట్టింది. డాగ్ బిస్కెట్లు అందుకు అదనం. ఆ కుక్కు కూడా సంతోషంగా భోజనాన్ని ఆరగించేది. కానీ, కుక్కకు శారీరక శ్రమ లేకుండా పోయింది. కుక్కను ఆ మహిళ ఎక్సర్సైజ్ కోసం బయటికి తీసుకెళ్లలేదు. ఇలా కొన్నాళ్లు సాగిన తర్వాత కుక్కలో ఊబకాయం మొదలైంది. అంచనాలకు మించి బరువు పెరిగిపోయింది. కదలడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వెళ్లింది. పది మీటర్లైనా నడవలేని ఊబకాయం ఆ కుక్కకు వచ్చింది. ఇలా శృతి మించి తినడం వల్ల కుక్క ఊబకాయానికి లోనై చనిపోయింది. దీంతో ఓనర్కు జైలు శిక్ష పడింది.
ఈ ఘటన న్యూజిలాండ్లో జరిగింది. ఆ దేశానికి చెందిన ఓ మహిళ నగిని పెంచుకుంది. ప్రతి రోజూ పది చికెన్ ముక్కలు, డాగ్ బిస్కెట్స్ పెట్టింది. నగి కూడా ఫుల్గా భోంచేసి కదలకుండా ఉండిపోయేది. దీంతో కుక్క శరీరానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ అందలేదు. ఈ విషయం సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయెల్టీ టు యానిమల్ (ఎస్పీసీఏ) తెలిసింది. వెంటనే ఆ పెంపుడు కుక్కను ఓనర్ దగ్గరి నుంచి తీసేసుకుంది. కుక్కను సంరక్షణలోకి తీసుకున్నప్పుడు అంటే 2021లో నగి 53 కిలోల బరువు ఉన్నది. తన సంరక్షణలో పెట్టుకుంది. రెండు నెలల్లో తొమ్మిది కిలోల బరువు ఈ సంస్థ తగ్గించగలిగింది. కానీ, లివర్ హిమరేజ్తో చనిపోయింది. లివర్ డిసీజ్ సహా పలు సమస్యలతో నగ్గి చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడించింది.
Also Read: బీఆర్ఎస్ ఘర్వాపసీ.. కేటీఆర్తో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే భేటీ
తమ దగ్గరికి వచ్చిన జంతువుల్లో అత్యంత ఊబకాయం నగికే ఉన్నదని ఎస్పీసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ వెస్ట్వుడ్ తెలిపారు. ఆ పెట్ డాగ్ ఎక్కువ ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొందని, అందుకు తగిన ఎక్సర్సైజ్ కూడా ఇవ్వకపోవడం వల్ల చనిపోయిందని ఆయన వివరించారు. ఆ కుక్కకు అందించిన డైట్, లైఫ్స్టైల్ గురించి నగి ఓనర్ పట్టించుకోలేదు. సవరించుకునే పని చేయలేదు. చివరి దాకా ఓవర్ఫీడ్ చేసింది. ఆ పెట్ డాగ్ తన కాళ్లపై తాను నడవడానికీ ఇబ్బంది పడే స్థాయి వరకు ఓవర్ ఫీడ్ చేస్తూనే వచ్చింది.
కోర్టులో నగి ఓనర్ తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. పెట్ డాగ్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తాను నిర్లక్ష్యం చేసినట్టు ఒప్పుకున్నారు. మనుకౌ జిల్లా కోర్టు ఆ ఓనర్కు రెండు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే రూ. 60 వేల జరిమానా విధించింది. అంతేకాదు, ఏడాది వరకు మరే పెట్ డాగ్ను పెంచుకోకుండా నిషేధం విధించింది. కుక్క చనిపోతే మనిషికి జైలు శిక్ష పడిందా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.