YS Sharmila on AP Govt(Andhra news today): ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అనుమానాలను లేవనెత్తారు. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్రమంత్రి పెమ్మసాని చెబుతున్నారని గుర్తు చేస్తూ.. అంటే రాష్ట్రంలో ఇక ఆరోగ్య శ్రీ లేనట్టేనా? అని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒక్క ఆయుష్మాన్ భారత్ పథకాన్నే అమలు చేయాలని భావిస్తున్నారా? అని అడిగారు.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ఏపీలోనూ అమలు చేయాలని అనుకుంటున్నారా? రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేయాలని ఆలోచిస్తున్నారా? అంటూ ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనుమానాలు వ్యక్తపరిచారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంలో భాగంగానే ఈ పథకానికి నిధులు కేటాయించడం లేదా? అని ప్రశ్నించారు. అందుకే పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులపై నిర్లక్ష్యం వహిస్తున్నారా? అని అడిగారు.
బిల్లులు చెల్లించే ఈ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదని సమాధానం చెబుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని వైఎస్ షర్మిల ప్రశ్నలు కురిపించారు. ఇందుకు కేంద్రం నుంచి వచ్చే రూ. 5 లక్షలు మినహా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేటాయింపులు జరపలేదని నిలదీశారు. అంటే.. రాష్ట్రంలో ఇక ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ఉండవనే సూచనలు చేస్తున్నారా? అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలన్నారు. ఈ గందరగోళంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also read: ఇది.. నా జీవితంలో మరపురాని ఘట్టం : మంత్రి పొన్నం భావోద్వేగం
గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కింద ఆస్పత్రులకు రూ.1,600 కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టిందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ స్థాయిలో బకాయిలు పేరుకుపోవడంతో కొన్ని హాప్పిటల్స్ ఈ పథకం కింద పేషెంట్లను తీసుకోవడమే మానేశాయని వివరించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేస్తే అది పేద ప్రజలకు శరాఘాతంగా మారుతుందని హెచ్చరించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఈ పథకాన్ని తీసుకువచ్చారని, రాష్ట్రంలో ఈ పథకం సక్సెస్ అయిందని వివరించారు. వైఎస్ రాజశేఖర్ తెచ్చిన పథకం ఆదర్శంగానే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను రూపొందించిందని వివరించారు. అలాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేసే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 1,600 కోట్లు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.