Narsingi Drugs case investigation..notices ready to send celebrities: హైదరాబాద్ పోలీసులకు సవాల్ గా మారిన నార్సింగి డ్రగ్స్ కేసులో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే రెండు కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడగా ఇందుకు సంబంధించి 20 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి డ్రగ్స్ కేసులో సినీ నటి రకూల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ను పోలీసులు అదుపుతోకి తీసుకున్న విషయం విదితమే. ఏ10 నిందితుడిగా అమన్ పై కేసు నమోదు అయింది. ఈ డ్రగ్స్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే పట్టుబడ్డ నిందితుల పోన్ నెంబర్లు ఆధారంగా చేసుకుని మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. 30 మందికి నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల వద్ద కీలక ఆధారాలతో కూడిన లిస్ట్ ఉందని సమాచారం. ఇందులో సిటీలో పేరు ఉన్న బడా పారిశ్రామికవేత్తలు, సినిమా సెలబ్రిటీలు, బిగ్ షాట్ వ్యాపారులు ఉన్నారని సమాచారం. త్వరలోనే అందరి పేర్లు బయటపెడతామని నార్సింగి పోలీసులు చెబుతున్నారు.
లైట్ గా తీసుకుంటున్న పోలీసులు
అయితే పబ్లిక్ మాత్రం గతంలో డ్రగ్స్ కేసులు మాదిరిగానే అందులో ఇది ఒకటి. ఏదో కొన్నాళ్లు హడావిడి చేయడం తప్ప వారిపై కఠిన చర్యలు ఉండకపోవడంతో మళ్లీ మళ్లీ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కుతున్నారని అంటున్నారు. దీని వెనక రాజకీయ శక్తులు కూడా ఉండవచ్చని అంటున్నారు. కొందరు తమ రాజకీయ, డబ్బు, హోదా పలుకుబడితో బెయిల్ తెప్పించుకుని దర్జాగా సమాజంలో తిరుగుతున్నారని అంటున్నారు. తమ పదవులకు ఎలాంటి ముప్పు వస్తుందో లేక ట్రాన్స్ ఫర్ అవుతుందో అని పోలీసు అధికారులు ఇలాంటి కేసులు లైట్ గా తీసుకుంటున్నారు. మరి కొందరు చట్టంలో లొసుగులను ఆధారం చేసుకుని ఇలాంటి కేసులనుంచి తప్పించుకుంటున్నారు.
కఠిన చట్టాలు ఏవి?
డ్రగ్స్ ను సమూలంగా నియంత్రించే కఠిన చట్టాలు అమలు చేయాలని..విశ్వనగరంగా పేరు తెచ్చుకుంటున్న హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా చేయవలసిన బాధ్యత పాలకులకు ఎంతైనా ఉందని అంటున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ ఎక్కువగా నైజీరియా వంటి దేశాలనుంచే వస్తున్నారని..వాళ్లని ఎయిర్ పోర్టులోనే బంధించి వాళ్ల పాస్ పోర్టులు ఇండియాలో చెల్లకుండా చేసి వాళ్ల దేశాలు తిరిగి పంపించే లా చట్టాలు తేవాలని అంటున్నారు పబ్లిక్.