FSSAI warns to Tea drinkers avoid out side hotels: చల్లగా చినుకులు పడుతుంటే వెచ్చగా టీ తాగాలని ఎవరికుండదు. కాస్త అల్లం దట్టించి, మిరియాలు, దాల్చిన చెక్, యాలకులు వంటివాటిని చేర్చి తాగితే దెబ్బకు జలుబు కూడా కంట్రోల్ కి వస్తుందని కొందరి నమ్మకం. కాఫీ కన్నా టీనే బెటర్ అంటారు వైద్య నిపుణులు. చాలా మంది టీ ఉత్తేజాన్ని ఇవ్వడానికి తాగుతుంటారు. కొందరు గంటగంటకూ టీ తాగుతుంటారు. వీరు భోజనం లేకపోయినా టీ మాత్రం లేకుండా జీవించలేరు. గల్లీకో టీ దుకాణాలు ఉంటాయి పట్టణాలలో. సరదాగా టీ సిప్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు మిత్రులు.
రకరకాల టీ లు
కొందరు రాత్రిళ్లు నిద్ర పట్టడానికి టీ తాగితే మరికొందరు మేలుకుని తెల్లవార్లూ ఉండేందుకు టీ తాగుతుంటారు. భారత్ లో దాదాపు 80 శాతం మందికి టీ తాగే అలవాటు ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక వీటిల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ అంటూ ఎన్నో రకాల టీలు ఉంటాయి. కరోనా సమయంలోనూ కొందరు అత్యుత్సాహంతో కరోనా టీ అంటూ అమ్మకాలు సాగించారు. అలాంటి ఔషధ గుణాలతో చేసిన టీ పొడులు కూడా మార్కెట్లో అమ్ముతుంటారు.
ఆ టీలు తాగొద్దు
ఇరానీ హోటల్స్ లో చాయ్, బన్ను, బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయని ఎక్కువగా ఫ్రెండ్స్ తో కలిసి ఇరానీ హోటల్లకు వెళ్లి గంటల తరబడి బాతాఖానీ కొడుతుంటారు. ఈ విషయాలు అటుంచితే ఇప్పుడు చాయ్ తాగే ప్రియులకు నిజంగా ఇది చేదు వార్తే అని చెప్పాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్తాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ షాకింగ్ వార్త చెప్పింది. బయట హోటళ్లలో టీ తాగవద్దని చెబుతోంది. ముఖ్యంగా హోటల్స్ యజమానులు రకరకాల టీ పొడులు తెప్పిస్తుంటారు. వాటిల్లో కెమికల్స్ శాతం అధికంగా ఉంటుందని అంటున్నారు.
చిక్కదనం కోసం రసాయనాలు
చిక్కదనం కోసం కొన్ని రకాల కెమికల్స్ ను టీ పొడిలో కలిపి సరఫరా చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా కార్మిసిన్, రొడమైన్ వంటి ప్రమాదకరమైన కలర్స్ ను టీ పొడులలో కలుపుతున్నారని వీటి వలన ఉదర సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఈ సంస్థ. ఇప్పటికే ఇలాంటి టీపొడులు సప్లై చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. ఇలాంటి పొడులపై నిషేధం విధించాలని భావిస్తోంది. ఇక్కడ కూడా ప్రభుత్వం స్పందించేలోగా బయట టీ బదులు ఎంచక్కా ఇంట్లోనే టీ తయారుచేసుకుని ఆస్వాదిద్దాం.