Telangana Assembly Sessions 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆరో రోజు సభ ప్రారంభమైంది. ప్రస్తుతం బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. కాగా, వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడా శాఖల పద్దులపై చర్చిస్తున్నారు.
అయితే సోమవారం చర్చించాల్సిన అంశాలు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు కీలక సూచనలు చేశారు. సోమవారం జరిగిన మాదిరిగా సుదీర్ఘ ప్రసంగాలు చేయకూడదని సభ్యులకు సూచించారు. ఈ మేరకు ఒక్కో సభ్యుడికి కేవలం 15 నిమిషాల సమయం కేటాయించారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని.. సబ్జెక్టుపైనే మాట్లాడాలని చెప్పారు. అయితే సోమవారం విద్యుత్ అంశంపై వాడీవేడిగా చర్చించిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. ఈ సమావేశంలో 19 అంశాలపై చర్చించనున్నారు. అయితే ప్రధానంగా ఇరిగేషన్, సివిల్ సప్లైపై వాడీవేడిగా చర్చస్తున్నారు. అలాగు 1.5లక్షల రుణాల వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. రెండో విడతలో 7 లక్షలమంది రైతులకు రూ.6,100కోట్లను జమ చేయనుంది. మధ్యాహ్నం 1వరకు అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.