Maoists Weekly festivals in telangana(TS today news): ప్రతి సంవత్సరం మావోయిస్టు నేతలు తమ ఉనికిని చాటుకునే యత్నంలో భాగంగా మావోయిస్టు వారోత్సవాలు జరుపుతుంటారు. తెలంగాణలో గత కొంతకాలంగా మావోయిస్టు చర్యలు తగ్గిపోయాయి. తెలంగాణ..చత్తీస్ ఘడ్ సరిహద్దులలో పోలీసు నిఘా వ్యవస్థ పెరిగింది. ఏజెన్సీలలోనూ మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిపోతోంది. ఇటీవల పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కగార్ సత్ఫలితాలను ఇస్తోంది. కేంద్రం, రాష్ట్రం కలిసి సంయుక్తంగా మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియలో భాగమే ఆపరేషన్ కగార్. అయితే గతంలోనూ మావోయిస్టులను అణిచివేసేందుకు కేంద్రం వివిధ పేర్లతో సిద్ధమయింది. 2005 సంవత్సరంలో ఆపరేషన్ సాల్వాజుడుం ని 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్, 2017 లో ఆపరేషన్ సమాధాన్, 2024లో ఆపరేషన్ కగార్ అంటూ పేర్లు జోడించి వ్యూహాత్మకంగా మావోయిస్టుల అణిచివేత కార్యక్రమాలు చేపడుతోంది కేంద్రం. ఇందుకోసం నిధులు సైతం కేటాయిస్తూ కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించింది.
భూటకపు ఎన్ కౌంటర్లు
మావోయిస్టు నేతలు మాత్రం ప్రభుత్వం తప్పుడు లెక్కలు తీస్తూ అమాయకులైన ఏజెన్సీ ప్రాంతపు నివాసితులపై అక్రమంగా కాల్పులు జరుపుతూ వాళ్లనే నక్సలైట్లు గా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది జులై 28 నుంచి మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 3 దాకా జరుగుతాయని పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు ఉధృతం చేశారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరు నాగారం, వెంకటాపురం, గుత్తికోయ గూడేలలో ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కాపలా కాస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలలో వాహనాలను, వాటి పత్రాలను పరిశీస్తున్నారు. గ్రామాలలో దండోరా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు, కొత్త వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరికలతో కూడిన దండోరా వేస్తున్నారు.
బలహీనంగా మారుతున్న నక్సల్స్
మంచిర్యాల, భద్రాచలం, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు ప్రాంతాలలో గత వారం రోజులుగా జల్లెడపడుతున్నారు పోలీసులు. ఎప్పటికప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు మావోయిస్టులు. గతంలో ఏదో ఒక ప్రాంతంలో విధ్వంసం సృష్టించి పోలీసులకు సవాల్ విసిరేవారు. అప్పట్లో బలమైన వ్యాహాలు పన్నే నాయకులు ఉండేవారు మావోయిస్టులకు. అయితే రానురానూ వాళ్లు అరెస్టవడమో లేక అసువులు బాయటమో జరుగుతోంది. దీనితో మావోయిస్టు కదలికలు ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పోస్టర్లు, బ్యానర్లు ,గోడమీద రాతలతోనే సరిపెడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండేవారితో నక్సల్స్ కు అనుబంధం ఉండేది. పోలీసులు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో నక్సల్స్ కదలికలు ముందుగానే పసిగడుతున్నారు. శక్తివంతమైన నిఘా కెమెరాలు, డ్రోన్ల ద్వారా మావోయిస్టు ప్రాంతాలను తేలికగా గుర్తిస్తున్నారు.
వెంటాడుతున్న నిధుల లేమి
మావోయిస్టులు కూడా నిధులు లేక అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోలేకపోతున్నారు. అయినా తమ కార్యకలాపాలను పెంచుకునే యత్నంలో భాగంగా ప్రతి సంవత్సరం వారోత్సవాలు జరుపుతుంటారు. అయితే వారోత్సవాలు వచ్చినప్పుడల్లా తనిఖీల పేరుతో తమను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు గిరిజనులు. అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య నలిగిపోతున్నామంటున్నారు. రాజకీయ నాయకులు కూడా ప్రత్యేకంగా నక్సల్స్ వారోత్సవాలలో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు పడుతుంటారు. అవసరం అయితే పోలీసుల సాయం తీసుకుంటుంటారు.