Basara : బాసర క్షేత్రంలో కొత్తసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్లైన్ లో అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్లైన్ అక్షరాభ్యాసాలకు టికెట్ల ధరలను నిర్ణయించింది.
ఆన్లైన్లో అక్షరాభ్యాసాలు బుక్ చేసుకుంటే వారికి పూజ చేసిన వస్తువులను తపాలాశాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ ధరలు.. విదేశీయులకు రూ.2,516, మన దేశంలో ఉన్నవారికి రూ.1,516గా నిర్ణయించారు. ప్రధానంగా ఉత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సమయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఆలస్యమవుతున్నాయి. భారీగా వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్లో అక్షరాభ్యాసాలు, పూజలు ప్రారంభించాలని బాసర దేవస్థాన అధికారులు నిర్ణయించారు.
బాసర శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్ లైన్ సేవలపై ఇటీవల ఆలయంలోని సిబ్బంది, వేద పండితులతో ఈఓ విజయరామారావు చర్చించారు. ఆన్ లైన్ అక్షర అభ్యాసాల ధరలను నిర్ణయించారు. ఈ టిక్కెట్ ధరలకు అనుమతి కోసం దేవదాయశాఖ కమిషనర్కు లేఖ రాశారు. దేవాదాయశాఖ నుంచి అనుమతి రాగానే ఆన్లైన్ లో అక్షరాభ్యాసాలు, సరస్వతీపూజ, మూలానక్షత్రం, వేద ఆశీర్వచనం పూజలను చేయడానికి ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకుతగిన విధంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.