Rohit Sharma : అన్ని ఫార్మాట్ల క్రికెట్లోనూ అనేక రికార్డులు నెలకొల్పుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… ఇప్పుడు మరో రికార్డు సృష్టించాడు. బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు… రోహిత్ శర్మ. ప్రపంచంలోనే ఈ ఫీట్ అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు. వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్గేల్ మాత్రమే 553 సిక్సర్లతో రోహిత్ కంటే ముందున్నాడు.
ఇక రోహిత్ తర్వాత షాహిద్ అఫ్రిదీ 476 సిక్సర్లతో మూడో స్థానంలో, బ్రెండన్ మెక్కల్లమ్ 398 సిక్సర్లతో నాలుగో స్థానంలో, ఎంఎస్ ధోని 359 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నారు. అయితే, రోహిత్ మినహా ఈ నలుగురూ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం సిక్సర్ల రికార్డులో రోహిత్ శర్మ దరిదాపుల్లో ఎవరూ లేరు. రోహిత్ కనీసం మరో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడినా… క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే… రోహిత్ శర్మ చెలరేగి ఆడే ప్రతీ ఇన్నింగ్స్లోనూ… నాలుగో, ఐదో సిక్సర్లు కచ్చితంగా ఉంటాయి కాబట్టి.
బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో… 28 బంతుల్లోనే 51 రన్స్ చేసిన రోహిత్ శర్మ… ఐదు సిక్సర్లు బాదాడు. హిట్ మ్యాన్ ఈ స్థాయిలో సిక్సర్లు బాదుతూ వెళ్తే… క్రిస్ గేల్ రికార్డును అధిగమించడమే కాదు… ఏకంగా 600 సిక్సర్లు కూడా కొట్టేస్తాడని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. అదే జరిగితే… ప్రపంచంలోనే 600 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించి… ఎవరికీ అందనంత ఎత్తులో రోహిత శర్మ ఉంటాడని అభిమానులు అంటున్నారు. వాళ్లు ఆశించినట్లే హిట్ మ్యాన్ మరికొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడి… సిక్సర్లలోనూ తిరుగులేని రికార్డు నెలకొల్పాలని కోరుకుందాం.