Himachalpradesh : హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే కాంగ్రెస్ కాస్త ముందంజలో ఉంది. బీజేపీ గట్టిగా పోరాడుతోంది.
హిమాచల్ ప్రదేశ్లో 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 35 సీట్లు అవసరం. అయితే మేజిక్ ఫిగర్ ఏ పార్టీ సాధించకపోతే ఇతరులు కీలకమవుతారు. మూడు, నాలుగు స్థానాల్లో ఇతర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అప్పుడు ఆ స్థానాలే హిమాచల్ ప్రదేశ్ లో ఏ పార్టీకి అధికారం దక్కుతుందో తేలుస్తాయి.
బలం తగ్గిన బీజేపీ
2017 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. అప్పుడు 44 స్థానాలు కాషాయ పార్టీ దక్కిందుకుంది. కానీ ఇప్పుడు దాదాపు 10 స్థానాలుపైగా కోల్పోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. ఆప్ అంతగా ఓట్లు చీల్చలేకపోయింది. దీంతో బీజేపీ బలం తగ్గింది.
పుంజుకున్న కాంగ్రెస్
అటు కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 21 స్థానాలు మాత్రమే దక్కాయి. కానీ ప్రస్తుతం ఎన్నికల్లో మరో 12 సీట్లుపైగా అదనంగా గెలవబోతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును రాబట్టడంలో కాంగ్రెస్ సఫలమైంది. ఆప్ బరిలో ఉండటంతో గుజరాత్ మాదిరిగా ఇక్కడకూడా కాంగ్రెస్సేకే ఎక్కువ నష్టం కలిగింది. గత ఎన్నికల మాదిరిగా బీజేపీతో ముఖాముఖి పోరు జరిగితే కాంగ్రెస్ కు భారీ విజయమే దక్కేది.
ఆప్ ప్రభావం శూన్యం
గుజరాత్ లో కాస్త ప్రభావం చూపించిన ఆప్..హిమాచల్ ప్రదేశ్ లో ఏమాత్రం సత్తా చాటలేకపోయింది. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి కనిపించడంలేదు. కాకపోతే చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఫలితాలను డిసైడ్ చేశాయి. మొత్తంమీద కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు హిమాచల్ ప్రదేశ్ లో పనిచేయలేదు.