Srisailam Dam gates opened: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ఉధృతి కారణంగా నీటి మట్టం పెరగడంతో అధికారులు జలాశయం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గేట్ల నుంచి కృష్ణమ్మ బిరా బిరా మంటూ కిందకు పరుగులు పెడుతున్నది. ఈ దృశ్యాలను జనాలు చూస్తూ సంబురపడుతున్నారు. ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లను వీడియో తీసుకుంటున్నారు.
అయితే, ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ, తుంగభద్ర నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారింది. జలాశయం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 180 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద నీరు వస్తున్నది. 4.67 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో గంట గంటకు ప్రాజెక్టులోని నీటి మట్టం పెరగడం, గంటకు ఒక టీఎంసీ చొప్పున డ్యాంకు నీరు వచ్చి చేరుతుండడంతో ఏ క్షణమైనా జలాశయ నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ముందస్తుగా ఎగువ నారాయణ పూర్, అలమట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహంతోపాటు ఇటు తుంగభద్ర జలాశయం, సుంకేసుల బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని లెక్క కట్టిన అధికారులు కనిష్ఠ స్థాయిలో శ్రీశైలం జలాశయంలో నీటిని నిలువ చేశారు.
Also Read: ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం 4 గంటలకు అధికారులు శ్రీశైలం జలాశయం మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల వరకు నీరు విడుదలవుతుందని అధికారులు చెబుతున్నారు.