Rain Alert for Telangana (Telangana weather news Telugu): తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. ఈ రెండు రోజులూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ స్పష్టం చేసింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలు చోట్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం లేకపోలేదని సూచించింది. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకు వీయొచ్చంటూ అందులో పేర్కొన్నది.
Also Read: రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు.. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ!
ఇదిలా ఉంటే.. ఇటు ఏపీని ఇంకా వర్షాలు వీడడంలేదు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని సూచించింది. మన్యం, అల్లూరి, కోనసీమ, గోదావరి జిల్లాలు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పలు చోట్ల జులై 29న వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా అక్కడక్కడా పిడుగులు పడే ఛాన్స్ ఉందని కూడా పేర్కొన్నది. అనకాపల్లి, కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది.
ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. లంక గ్రామాల్లో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వారం రోజుల నుంచి పడవల మీదనే ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ధవళేశ్వం వద్ద వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో హెచ్చరికను జారీ చేశారు.