Gujarat : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. గుజరాత్ ఓటర్లు ఏకపక్షంగా తీర్పు ఇచ్చేశారు. బీజేపీ ఏడోసారి అధికారం దక్కించుకోవడం ఖాయమైంది. 2017 ఎన్నికలు కంటే 50 స్థానాలు ఎక్కువగా బీజేపీ గెలవబోతోందని తేలిపోయింది. దాదాపు 150 స్థానాలు బీజేపీ దక్కించుకోవడం ఖాయం. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఈ సారి డీలా పడింది. దాదాపు 20 స్థానాలకే పరిమితం కాబోతోంది.
గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థులు హవా కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తో ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టమైనా.. ఆప్ బరిలో ఉండటంతో సంచలనాలు నమోదవుతాయనే అనుమానాలు ఉన్నాయి. అయితే గుజరాత్ ఓటర్లు మాత్రం మళ్లీ బీజేపీకే పట్టంకట్టారు. వరుసగా ఏడోసారి అధికారాన్ని అప్పగిస్తున్నారు. 1995 నుంచి గుజరాత్ లో బీజేపీ పాలనే కొనసాగుతోంది.
కాంగ్రెస్ మరింత డీలా..
గుజరాత్ లో 2017 అసెంబ్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠ సాగాయి. మెజార్టీకి కేవలం 7 స్థానాలు మాత్రమే ఎక్కువగా బీజేపీకి దక్కాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చింది. గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా..అప్పుడు బీజేపీకి 99 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ 77 చోట్ల విజయం సాధించింది. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ 55 పైగా స్థానాలు కోల్పోతోంది. ఆప్ ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ కు భారీ నష్టం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలిపోవడంతో బీజేపీకి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో గతంలో కంటే దాదాపు 50 స్థానాలు ఎక్కువగా బీజేపీకి దక్కబోతున్నాయి.
ఆప్ అట్టర్ ప్లాప్ షో
పంజాబ్ మాదిరిగానే సంచలన విజయం సాధిస్తామని బీరాలు పలికిన ఆప్ కు గుజరాత్ చేదు అనుభవాలను మిగులుస్తోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న ఆనందం ఆప్ కు ఒక్కరోజులోనే ఆవిరైంది. గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆప్ సింగిల్ డిజిట్ కే పరిమితం కాబోతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయోగించిన పంజాబ్ ఫార్ములా గుజరాత్ లో పనిచేయలేదు. ఓట్లు చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చడం తప్ప ఆప్ సాధించింది ఏమిలేదని చెప్పాలి. ఆప్ ప్రభావం మాత్రం కాంగ్రెస్ పై పడింది. అందుకే కాంగ్రెస్ 2017 కంటే తక్కువ స్థానాలకే పరిమితం కాబోతోంది.