JC Prabhakarreddy met YS Vijayamma: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరు… ఎప్పుడూ విడిపోతారో తెలీదు. ఎప్పుడు ఎక్కడ కలుస్తారో తెలీదు. అలాంటి సన్నివేశం లో ఒకటి ఏపీ రాజకీయాల్లో సోమవారం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి హైదరాబాద్లో వైఎస్ విజయమ్మను కలిశారు.
జగన్ అంటే ఒంటికాలి లేస్తారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి. జగన్ ప్రభుత్వం హయాంలో ఆయనను ఇబ్బందిపెట్టడమేకాదు వ్యాపారాలకు సైతం చెక్ పెట్టారు. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డి పనై పోయిందని భావించారు. టీడీపీ అధికారంలోకి రావడంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు.
హైదరాబాద్ తన అన్న జేసీ దివాకర్రెడ్డి వద్దకు వచ్చారు ప్రభాకర్రెడ్డి. మరి ఏమైందో తెలీదుగానీ నేరుగా వెళ్లి వైఎస్ విజయమ్మను కలిశారాయన. దాదాపు అరగంటపాటు చర్చించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు, జగన్- షర్మిల భవిష్యత్తుపై చర్చించినట్టు సమాచారం. రాజకీయాలు లేవని, కేవలం విజయమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వచ్చారన్నది జేసీ సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట.
కారణాలు ఏమైనా కావచ్చు.. సడన్గా విజయమ్మను జేసీ ప్రభాకర్రెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి విజయమ్మతో భేటీ మర్యాద పూర్వకంగానే జరిగిందా? లేక ఏమైనా రాజకీయ కారణాలున్నాయా? ఇవే ప్రశ్నలు అధికార-విపక్షాలను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. అంతర్గతంగా ఏమి జరిగిందనేది ఎలాంటి సమాచారం బయటకురాలేదు. కేవలం ఫోటో మాత్రమే బయటకు వచ్చింది.
ALSO READ: కడపలో చంద్రబాబు యాక్షన్ 2.0.. ఎలా ఉండబోతుంది ?
అన్నట్లు విజయమ్మ స్వగ్రామం తాడిపత్రి ప్రాంతంలో ఉంది. సహజంగా రిలేషన్షిప్ ఉంటుంది. రాజకీ యాల పరంగా విజయమ్మ ఇప్పటికే తన కూతురు షర్మిల వైపు మొగ్గుచూపారు. కొడుకు జగన్ను పక్కన పెట్టి ఓపెన్గా కూతురుకి సపోర్టు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ సమయంలో విజయమ్మను జేసీ ప్రభాకర్రెడ్డి సమావేశం కావడం ఏపీ అంతటా చర్చ మొదలైంది.