Venezuela: దక్షిణ అమెరికా దేశం వెనెజూలా అధ్యక్ష ఎన్నికల్లో నికోలాస్ మడురో మూడోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన 51 శాతం ఓట్లతో గెలుపొందారని.. ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు రాకముందు దేశంలోని అన్ని మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో ప్రతిపక్ష నాయకుడు ఎడ్ మండో గొన్జలేజ్ ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 59 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
వెనెజూలా ప్రెసిడెంట్ ఎన్నికలు ఈ సారి వివాదాస్పదంగా మారాయి. ఈ ఎన్నికలు చాలా ఆలస్యంగా నిర్వహించడంతో పాటు.. ఎన్నికల యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. పైగా దేశ ప్రజలంతా సోషలిస్ట్ విధాలున్న ప్రతిపక్ష పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నట్లు ఇంతకాలం ప్రచారం జరిగినా ఎన్నికల్లో మరోసారి మడురో విజయం సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఎన్నికల నిర్వహణలో డేటా ట్రాన్సమిషన్ కు సంబంధించి టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో ఈ ఫలితాలపై తమకు నమ్మకం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరియా కొరీనా మచాడో లాంటి ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో పారదర్శకతపై మిలిటరీ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మిలిటరీ పూర్తిగా అధ్యక్షుడు మడురో కే మద్దతుగా గతంలో నిలిచింది.
ఒక బస్ డ్రైవర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన మడురో.. దేశంలో ఆర్థిక స్థిరత్వం తీసుకువస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వెనెజూలా లో తీవ్ర ఆర్థిక సంక్షోభంతోపాటు, ద్రవోల్బణం అసలు అదుపు చేయలేని స్థితిలో ఉంది. దీంతో ఉద్యోగం లేక జనాభాలో చాలా మంది ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ఈ సమస్యలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలు అధ్యక్షుడు మడురో .. దేశాన్ని నడపడంతో విఫలమైనట్లు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి.
మరోవైపు ప్రపంచదేశాలతో వెనెజూలా సంబంధాలు స్నేహపూర్వకంగా లేకపోవడం మరో పెద్ద సమస్య. తాజా ఎన్నికల్లో పారదర్శకత లేదని అమెరికా అభిప్రాయపడింది. ఇంతకుముందు 2018 ఎన్నికల్లో కూడా మడురో గెలవడంతో ఎన్నికల నిర్వహణ మోసపూరితంగా జరిగిందని ఆరోపిస్తూ.. వెనెజూలాపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు మరోసారి మడురో అధ్యక్ష పదవి చేపట్టడంతో అమెరికా, వెనెజూలా సంబంధాలు మరింత దిగజారే ప్రమాదముందని విశ్లేషకులు అభిప్రాయం.
Also Read: శుభవార్త చెప్పిన కమలా హారిస్