Kavitha: కల్వకుంట్ల కవిత. టాక్ ఆఫ్ ది టౌన్. కొట్టి కొట్టి చంపుతానంటూ ఇటీవల బీజేపీ ఎంపీ అర్వింద్ పై నోరు పారేసుకున్నారు. ఆయన ఇంటిపై ఆమె అనుచరులు దాడి చేశారు. కట్ చేస్తే, ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో కవిత పేరు. వస్తానంటూ.. రానంటూ.. చివరాఖరికి ఆదివారం డేట్ ఫిక్స్ చేశారు. ఇదే సమయంలో జగిత్యాలలో సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే, ఆ సభకు ఇంఛార్జ్ కవితనే కాబట్టి.
జగిత్యాల జిల్లాతో కవితకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచిన లీడర్. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కవితను జగిత్యాల ఇంఛార్జ్ గా నియమించి.. జీవన్ రెడ్డిని ఓడించేలా చేశారు కేసీఆర్. అప్పటి నుంచి ఆ ప్రాంతంతో కవితకు ప్రత్యేక అనుబంధం. ఇదంతా ఎప్పుడో మూడున్నరేళ్ల కిందటి మాట. మళ్లీ ఇప్పుడు జగిత్యాల సభ భాధ్యతలు కవితకే ఎందుకు ఇచ్చినట్టు? ఏ హరీష్ రావుకో.. గంగులకో ఇవ్వొచ్చుగా? అనే డౌటు.
కేసీఆర్ ఏ చిన్న పని చేసినా.. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందని అంటుంటారు. జగిత్యాల సభ ఏర్పాట్లకు కవితను ఇంచార్జిగా నియమించి.. మళ్లీ ఆమెను అక్కడ యాక్టివ్ చేయడంలో ఏదో మతలబు ఉందనే అనుమానం. ఇక, సభలో వేదిక మీదున్న అందరి పేర్లను ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పేరు ఎత్తకపోవడం గుసగుసలకు తావిస్తోంది. గులాబీ బాస్ కావాలనే సంజయ్ పేరు తీయలేదా? లేదంటే, మర్చిపోయారా?
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అర్వింద్ వర్సెస్ కవిత వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. నువ్వా నేనా.. సమరానికి సై అంటూ.. ఎన్నికల్లో తేల్చుకుందామంటూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఎంపీ అర్వింద్ ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం.. దాడికి ప్రయత్నించడం లాంటి ఘటనలతో వారిద్దరి మధ్య రాజకీయ పోరు హోరెత్తుతోంది.
తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కవితను చుట్టుముట్టడంతో ఆమె ఇమేజ్ కు బాగానే డ్యామేజ్ జరిగింది. ఆ కేసు మరింత బిగిస్తే.. కవిత రాజకీయ మనుగడకే ప్రమాదం రావొచ్చు. అటు, బీజేపీ దూకుడు మీదుండటం.. నిజామాబాద్ లో అర్వింద్ బలం ఏమాత్రం తగ్గకపోవడం.. సర్వేల్లో తేడా రావడంతో.. కేసీఆర్ అలర్ట్ అయ్యారని అంటున్నారు. నిజామాబాద్ లో ఇప్పటికే ఓసారి ఓడిపోయి కవిత బాగా బద్నామ్ కాగా.. మళ్లీ ఓడితే ఇక రాజకీయంగా కోలుకోవడం చాలా కష్టమని గులాబీ బాస్ భావిస్తున్నారట. అందుకే, కూతురు కోసం పక్కాగా గెలిచే ఛాన్స్ ఉన్న ఓ సేఫ్ ప్లేస్ కోసం గాలిస్తే.. జగిత్యాల బెస్ట్ అని తేలిందట.
గతంలో జగిత్యాలలో పని చేసిన అనుభవం ఉండటం.. ఇప్పటికీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పట్టు కొనసాగుతుండటం.. సర్వేలూ అనుకూలంగా రావడంతో.. ఈసారి కవితను నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాకుండా.. జగిత్యాల నుంచి అసెంబ్లీ బరిలో నిలుపుతారని అంటున్నారు. అందుకే, జగిత్యాల సభ బాధ్యతలు కవితకు అప్పగించి.. ఆమెను అక్కడ మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో, సభలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు ఎత్తకుండా ఆయన్ను ఆఫ్ లైన్ చేసే పని మొదలెట్టేశారని.. ఇదంతా కవిత కోసమేనని అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేగా…