Heavy Water Flow at Jurala and srisailam dam gates open today: మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాలకు భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులోకి 3లక్షల 5వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు జూరాల జలశాయం వద్ద 41 గేట్లను ఎత్తి 2,75,538 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 18,922 కలిపి దిగువనున్న శ్రీశైలానికి వదిలారు.
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 317.73 మీటర్లకు చేరుకుంది. కాగా, ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 7.971 టీఎంసీలకు చేరింది. జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు లిఫ్ట్నకు 750, భీమా లిఫ్ట్ 1 కు 1,300, భీమా లిఫ్ట్ 2కు 750, జూరాల ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 578, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి వస్తున్న వరద మరింత పెరుగుతుంది. ప్రస్తుతం 1.49 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. దీంతో డ్యాం నుంచి 28 గేట్లు తెరిచి 1, 46,746 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువన ఉన్న ఆల్మట్టి, తుంగభద్ర, జూరాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్లు ఓపెన్ చేసి నాగార్జునసాగర్ డ్యాంకు నీటిని విడుదల చేయనున్నారు. మొదట ఈనెల 30న గేట్లు ఎత్తాలని అధికారులు భావించినప్పటికీ..వరద ప్రవాహం పెరగడంతో సోమవారం సాయంత్రంలోగా ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: చిక్కుల్లో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్కుమార్, 1000 కోట్ల స్కామ్..
ఇదిలా ఉండగా, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,116 ఉండగా.. ఔట్ ఫ్లో 391 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 14.47 టీఎంసీలకు చేరుకుంది.