Road Accident in SangaReddy (Telangana News): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్కల్ మండంలోని హుసెల్లి వద్ద వేగంగా వచ్చిన ఓ ట్రక్కు..కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
జహీరాబాద్ – బీదర్ రహదారిపై సోమవారం ఉదయం కారును ట్రక్కు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ తోపాటు ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానికులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని బీదర్ వాసులుగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ప్రమాదం చోటుచేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.