IND vs BAN: ఇటీవల న్యూజిలాండ్.. ఇప్పుడు బంగ్లాదేశ్. టీమిండియాను వరుస ఓటములు వెంటాడుతున్నాయి. పేపర్ పులులు.. గ్రౌండ్ లో తుస్సుమంటున్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో ఓడిపోయింది భారత్. బంగ్లా దేశ్ విధించిన 271 రన్స్ ను చేధించేందుకు చివరి వరకూ పోరాడినా.. ఓటమి తప్పలేదు. ఆఖర్లో రోహిత్(51*) చెలరేగి ఆడినా గెలుపు దక్కలేదు. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే.. 2-0తో సిరీస్ బంగ్లాదేశ్ వశం అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 272 పరుగుల ఛేదనలో భారత బ్యాటర్లు తడబడ్డారు. 65 రన్స్ కే 4 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. శ్రేయస్(82), అక్షర్(56) భారత్ ను గెలిపించే ప్రయత్నం చేశారు. కోహ్లీ 5, ధావన్ 8, సుందర్ 11, రాహుల్ 14 లు మరోసారి విఫలమయ్యారు. 9 వికెట్ల నష్టానికి 266 పరుగుల దగ్గరే ఆగిపోయి.. ఓటమి పాలైంది.
టీమిండియాను బంగ్లా బౌలర్లు పకడ్బందీగా కట్టడి చేశారు. హోసెన్ 3, షకీబ్ 2, మెహదీ 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢాకా వేదికగా ఈ నెల 10న ఇరు జట్ల మధ్య నామమాత్ర మూడో వన్డే జరగనుంది.