India vs Sri Lanka T20 Series: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా(53) రాణించగా.. పాతుమ్ నిస్సంక 32 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో రవి బిస్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టగా..అర్షదీప్ సింగ్ రెండు, అక్షర్ పటేల్ రెండు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు.
శ్రీలంక విధించిన 162 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన భారత్ కు వరుణుడు అడ్డుకున్నాడు. మొదటి మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయగా..వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గిన అనంతరం అంపైర్లు పిచ్ ను పరిశీలించి 8 ఓవర్లకు కుదించారు. దీంతో భారత్ టార్గెట్ 78 పరుగులుగా నిర్ణయించారు.
Also Read: తొలి పతకం సాధించిన మను భాకర్ ఎవరు? ఆమె గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఓపెనర్ యశస్వి జైస్వాల్(30), సూర్యకుమార్ యాదవ్(26) రాణించారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య(22)చెలరేగడంతో భారత్..కేవలం 6.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే గిల్ స్థానంలో ఈ మ్యాచ్కు అవకాశం దక్కించుకున్న సంజు డకౌట్ గా విఫలమయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, వానిందు హసరంగా, పతీరణ తలో వికెట్ తీశారు.