Tollywood producer U.Suryanarayana Babu died..Mahesh babu uncle
ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (73)మృతి చెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. దీనితో టాలీవుడ్ లో విషాధ ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్తను టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. ఆయన మరణం పట్ట తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. సూర్యనారాయణ బాబు స్వయానా హీరో కృష్ణ చెల్లెలి భర్త. లక్ష్మి తులసిని పెళ్లి చేసుకున్న యు.సూర్యనారాయణ బాబు నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు పద్మావతి బ్యానర్ పై నిర్మించారు. హీరో కృష్ణ స్వయంగా ప్రోత్సహించి తన పద్మాలయా బ్యానర్ లాగా పద్మావతి బ్యానర్ ను బావగారితో పెట్టించి తాను కూడా దగ్గరుండి నిర్మాణ బాధ్యతలు చూసుకునేవారు. హీరో మహేష్ బాబుకు మేనత్త భర్త . మహేష్ ఆప్యాయంగా మావయ్య అని పిలుచుకునేవారు. ఏనాటికైనా మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమాను తీయాలనుకున్న సూర్యనారాయణ బాబు ఆ కోరిక తీరకుండానే మృతి చెందారు.
పలు కమర్షియల్ సినిమాల నిర్మాతగా..
పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయన మనుషులు చేసిన దొంగలు సినిమాతో నిర్మాతగా మారారు. 1977లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దొంగల దోపిడీ, రామ్ రాబర్ట్ రహీమ్, బజార్ రౌడీ, శంఖారావం వంటి చిత్రాలను నిర్మించి కమర్షియల్ నిర్మాతగా ఆర్థిక విజయం అందుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో రెండు హిందీ చిత్రాలను నిర్మించారు. కన్నడంలోనూ అగ్ర హీరో అంబరీష్ తో రెండు సినిమాలు తీశారు.ప్రముఖ నటి సుజాత కథానాయికగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంతో ఈయన నిర్మించిన ‘సంధ్య’ చిత్రం కమర్షియల్ గా హిట్ సాధించడమే కాకుండా అభిరుచి కలిగిన నిర్మాతగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లో బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమాకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సుజాత కూడా ఫ్యామిలీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.
పాన్ ఇండియా మూవీ కోరిక తీరకుండానే..
దాదాపు 20కి పైగా చిత్రాలను తీసిన యు.సూర్యనారాయణ బాబు కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే తన మనవడు అభినవ కృష్ణ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా సినీ ప్రముఖుల మధ్య జరిపారు. అదే వేడుకలో హీరో కృష్ణ పుట్టినరోజు వేడుకలు చేశారు. ఒకే సారి రెండు వేడుకలు జరగడంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఆనంద సాగరంలో మునిగిపోయింది. హీరో కృష్ణ మీద ఉన్న అభిమానంతో తన కొడుకుకు అభినవ కృష్ణ అనే పేరు పెట్టుకున్నారు. తన బావ కృష్ణ మరణం బాగా కుంగదీసింది. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన సూర్యనారాయణ బాబు తీవ్ర అనారోగ్యానికిక గురయ్యారు. తన పద్మావతి బ్యానర్ పై ఓ భారీ పాన్ ఇండియా సినిమాలను తీయాలని అనుకున్నారు. మహేష్ డేట్స్ ఇస్తే సినిమా మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే మృతి చెందారు. రాజకీయాలలోనూ సంచలనం సృష్టించిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గుడివాడలో సీనియర్ ఎన్టీఆర్ పై పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఓడిపోయారు. సూర్యనారాయణ బాబు మృతికి నివాళిగా పలువురు నిర్మాతలు, నటులు, దర్శకులు ఆయనకు నివాళులు తెలిపారు.