CBI: అవినీతి, అక్రమాల కేసుల్లో ఎక్కువగా వినిపించేది రాజకీయ నేతల పేర్లే. ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీబీఐ దాడులూ పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్షాలను సీబీఐతో టార్గెట్ చేయిస్తోందనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. వివిధ రాష్ట్రాల్లో, పార్టీల నేతలపై సీబీఐ కేసులు ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు అగ్రస్థానంలో ఉండటం కలకలం రేపుతోంది.
గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
2017-2021 మధ్య కాలంలో ఏపీలో 10 సీబీఐ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఆ తర్వాత స్థానంలో ఆరు కేసులతో ఉత్తరప్రదేశ్, కేరళ నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్లో 5 కేసులు చొప్పున నమోదయ్యాయి. తమిళనాడులో నాలుగు కేసులు ఉన్నాయి.
2017 నుంచి 2022 అక్టోబరు నాటికి దేశ వ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదైనట్టు మంత్రి వెల్లడించారు. వాటిలో 22 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్టు తెలిపారు. సీబీఐ కేసులలో శిక్ష పడే రేటు సుమారు 70శాతం వరకూ ఉన్నట్టు డీఓపీటీ వివరణ ఇచ్చింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై 10 సీబీఐ కేసులతో ఏపీ టాప్ లో ఉంటే.. జాబితాలో తెలంగాణ పేరు లేకపోవడం ఆసక్తికరం. అంటే, మిగతా వాళ్లంతా మిస్టర్ క్లీనా?