Singareni: ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఆ సభలో సింగరేణి గనుల ప్రైవేటీకరణ చేసేది లేదని స్పష్టం చేశారు. సింగరేణిలో కేంద్రం వాటా కంటే, రాష్ట్ర వాటానే ఎక్కువ అని.. ఏదైనా చేస్తే రాష్ట్రమే చేయాలని చెప్పారు. ప్రధాని అంతటి వారే చెప్పడంతో అంతా నిజమే అనుకున్నారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణ జరగడం లేదనుకున్నారు. కానీ, తాజాగా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ తీరు మారింది. పారదర్శకంగా గనుల అమ్మకం చేపడుతున్నామని చెప్పడం కలకలం రేపుతోంది.
సింగరేణి కోల్మైన్స్ వేలంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయంటూ పార్లమెంట్ లో ప్రస్తావించారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయనకు టీఆర్ఎస్ ఎంపీలు సైతం జత కలిశారు. 4 బొగ్గు గనుల ప్రైవేటీకరణ, అమ్మకాలను వ్యతిరేకించారు. కల్యాణ్ గని, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణిపల్లి కోల్ బ్లాక్స్ వేలాన్ని రద్దు చేయాలని లోక్ సభలో డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ చెప్పారని లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణలోని నాలుగు బ్లాకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా 38 బ్లాకులు అమ్ముతున్నారని సభలో ఆందోళనకు దిగారు.
సింగరేణి బొగ్గు గనుల వేలంపై టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఆందోళనలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. తెలంగాణ ఎంపీల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణ ఉమ్మడి భాగస్వామ్యం ఉందన్నారు. అయితే, గనుల వేలం మొదలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. పారదర్శకంగా ఆక్షన్ వేస్తున్నామని.. దీనికి అంగీకరిస్తే తెలంగాణ సర్కార్కి కూడా ప్రయోజనం ఉంటుందన్నారు మంత్రి ప్రహ్లాద్ జోషి. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరిస్తున్నాయని.. వేలం ద్వారా వచ్చే ఆదాయం వాటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుందని తెలిపారు. కోల్స్కాంలో ఉన్నవాళ్లే బొగ్గు గనుల పారదర్శక వేలంను వ్యతిరేకిస్తున్నారన్నారని ఆరోపించారు ప్రహ్లాద్ జోషి.