Gutta Jwala: పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నది. అదేవిధంగా పలువురు క్రీడాకారులు కూడా ముందువరుసలో దూసుకువెళ్తున్నారు. అయితే, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత బృందానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి.
భారత్ తరఫున ఒలింపిక్స్ కు వెళ్లిన క్రీడాకారులకు ఇచ్చిన వస్త్రాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా నెట్టింట స్పందించారు. దుస్తులను డిజైన్ చేసినవారిపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు.
Also Read: భారత్కు షాకిచ్చి టైటిల్ను సొంతం చేసుకున్న శ్రీలంక
సోషల్ మీడియాలో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు.. టీమిండియా దుస్తులు డిజైన్ చేసినవారిపై మంచి అంచనాలు ఉండేవి. అయితే, ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు మమ్మల్ని ఎంతగానో నిరాశపరిచాయి. అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాదు. డిజైనర్లు ఈ విషయాన్ని ఎలా ఆలోచించలేకపోయారో అర్థం కావడంలేదు. రెడీ టు వేర్ శారీ తయారు చేసి ఉంటే చాలా బాగుండేది. భారత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించేందుకు డిజైనర్లకు అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు. దుస్తులు నాసిరకంగా ఉండడంతో అవి చినిగిపోతున్నాయి. అంతేకాదు అవి సౌకర్యంగా లేవు. ఇప్పటికైనా క్రీడాకారులకు ఇచ్చేటువంటి దుస్తుల నాణ్యతపై దృష్టి సారించాలి’ అంటూ ఆమె ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.