Tax Clearance Certificate: విదేశాలకు వెళ్లేవారికి ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదన విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో ఆదాయపు పన్ను విభాగం తాజాగా స్పందించింది. దీనిపై వివరణ ఇస్తూ.. ప్రతిపాదిత సవరణలు అందరికీ వర్తించబోవంటూ స్పష్టం చేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినవారు, భారీగా పన్ను బకాయిలు ఉన్నారు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.
అయితే, ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందేందుకు పూర్తి చేయాల్సిన పనుల్లో ‘బ్లాక్ మనీ యాక్ట్ 2015’కు వర్తించే నిబంధనలను కూడా చేర్చాలంటూ బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఫలితంగా సదరు సర్టిఫికెట్ కావాలనుకునేవారు బ్లాక్ మనీ యాక్ట్ కింద ఎలాంటి లావాదేవీలు బకాయి పడి ఉండేందుకు వీలుండదు. అయితే, ప్రతిపాదించిన సవరణ ప్రకారం నివాసితులందరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.
Also Read: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ..
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 230 ప్రకారం ప్రతి ఒక్కరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరంలేదు. నిర్దిష్ట వ్యక్తులు మాత్రమే పలు సందర్భాల్లో ఈ సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినవారు లేదా ఆదాయపు పన్ను చట్టం లేదా సంపద పన్ను చట్టం కింద నమోదైన కేసుల్లో పాత్ర ఉన్న వ్యక్తి మాత్రమే పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
కాగా, సరైన కారణాలు చూపించి ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ నుంచి అనుమతి పొందిన తరువాతే ఏ వ్యక్తినైనా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ను కోరుతామంటూ ఐటీ విభాగం తేల్చి చెప్పింది. ఆదాయపు పన్ను చట్టం, సంపద పన్ను చట్టం, గిఫ్ట్ ట్యాక్స్ చట్టం, వ్యయ పన్ను చట్టం కింద ఎటువంటి బకాయిలు లేవంటూ ఐటీ విభాగం ఈ సర్టిఫికెట్ను జారీ చేస్తుంది.