Delhi Coaching Centre Incident: ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా సివిల్స్ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పార్లమెంటులో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, భద్రతలేని నిర్మాణం.. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల బాధ్యతారాహిత్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తున్నదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఢిల్లీలోని ఓ భవనంలోకి నీరు చేరి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మృతిచెందడం చాలా దురదృష్టకరం. కొద్దిరోజుల క్రితం కూడా వర్షాల వల్ల విద్యుత్ షాక్ తగిలి ఓ విద్యార్థి ఇదేవిధంగా దుర్మరణం చెందాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘటనకు కారణం వ్యవస్థల సంయుక్త వైఫల్యం. అసురక్షితమైన నిర్మాణం, పేలవమైన భవన నిర్మాణ ప్రణాళిక, సంస్థల బాధ్యతాహరాహిత్యం వల్ల సామాన్య ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ప్రతి ఒక్కరి హక్కు. దాన్ని అందించడం అనేది ప్రభుత్వాల బాధ్యత’ అంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పేర్కొన్నారు.
Also Read: వామ్మో కోచింగ్ సెంటర్ లోకి వదరనీరు..ముగ్గురు మృతి
ఇదిలా ఉంటే.. సెంట్రల్ ఢిల్లీలోని రాజిందర్ నగర్లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లోకి వరద పోటెత్తడంతో సివిల్స్కు సన్నద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. దీంతో ఢిల్లీ పోలీసులు కోచింగ్ సెంటర్ యజమాని, సమన్వయకర్తను అదుపులోకి తీసుకున్న విషయం విధితమే.