Minister Uttamkumar Reddy: కాళేశ్వరంపై మాజీ మంత్రి కేటీఆర్ దిక్కుమాలిన మాటలు మాట్లాడరని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. జలసౌధలో నీటి పారుదల శాఖపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆరున్నర లక్షల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని మంత్రి తెలిపారు. నీటిపారుదల శాఖకు నిధులు బాగానే ఉన్నాయని, ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనులు చేయాలని, విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఉత్తమ్ కుమార్ హెచ్చరించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ పనులు సకాలంలో పూర్తి కావాలని, పనులను మంచిగా పూర్తిచేసిన వారిని గుర్తిస్తామన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సలహాలను వెంటనే పూర్తి చేయాలని, ప్రజాధనం అత్యంత విలువైందన్నారు. ప్రతీ పైసా జాగ్రత్తగా ఖర్చు చేయాలని సూచించారు.
ఆర్థిక బడ్జెట్ లో నీటిపారుదలకు క్లారిటీ వచ్చిందన్నారు. గత ప్రభుత్వం లాగా అబద్ధాలు చెప్పమని, ప్రతి ఏడాది 6 నుంచి 6.5లక్షల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. కేటీఆర్ అబద్ధాలను ప్రజలు నమ్మరని, మీ కమీషన్ల కక్కుర్తితో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.
మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులో లోపాలు జరిగాయని దేశంలో ఉన్న గొప్ప ఇంజనీర్లు చెప్పారన్నారు. సరిగ్గా సాయిల్ టెస్ట్ కూడా చేయలేదన్నారు. తుమ్మిడిహిట్టి దగ్గర కట్టి ఉంటే ఒకే లిప్ట్ తో నీళ్లు వచ్చేవన్నారు.
కేసీఆర్, కేటీఆర్ వాళ్లు ఆస్తులు పణ్ణంగా పెట్టి మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టలేదని, అందరిని తాకట్టు పెట్టి నిర్మించారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు.