Fans react as Sri Lanka Kamindu Mendis bowls with both hands against India: శ్రీలంక పర్యటనలో భాగంగా టీమ్ ఇండియా తొలి టీ 20 మ్యాచ్ ఆడింది. 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మొదట బ్యాటింగు చేసిన టీమ్ ఇండియా శ్రీలంక బౌలింగును ఒక ఆటాడుకుంది. ఈ సమయంలో సూర్యకుమార్- రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. ఒకరు కుడి చేతి వాటమైతే, మరొకరు ఎడమ చేతి వాటం.. ఇలాంటి సమయంలో బౌలర్లు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు.
ఎందుకంటే ఇద్దరికి చెరొక విధంగా బౌలింగు చేయాలి. చాలామంది బౌలర్లు ఆ లయను అందుకోలేక అవస్థలు పడుతుంటారు. ఒకొక్కసారి లూజ్ బాల్స్ వేసి మూల్యం చెల్లిస్తుంటారు. అయితే శ్రీలంక బౌలర్ అయిన కమిందు మెండిస్ కి రెండు చేతులతో బౌలింగు వేయడం వచ్చు. నిజానికి తను వేసింది ఒకటే ఓవరు. కాకపోతే సూర్యకుమార్ వచ్చినప్పుడు ఒక చేత్తో వేశాడు. అదే రిషబ్ పంత్ వచ్చినప్పుడు ఎడమ చేత్తో వేశాడు.
ఇది నెట్టింట తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇలా రెండు చేతులతో బౌలింగు వేయవచ్చా? అనే ప్రశ్నలు వినిపించాయి. అలాగే ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? వీటన్నింటిపై చర్చ మొదలైంది. ఈ డిబేట్లు, అలాగే కమిందు మెండిస్ వేసిన ఓవర్ వైరల్ గా మారింది.
అయితే ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే, ఏ చేత్తోనైనా బౌలింగు వేయవచ్చు. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 21.1.1 రూల్ ప్రకారం.. ఒక బౌలర్ కుడి చేతితో బౌలింగ్ చేస్తాడా? ఎడమ చేతితో బౌలింగ్ చేస్తాడా? అనేది అంపైర్కు ముందే కచ్చితంగా చెప్పాలి. లేదంటే మాత్రం నో బాల్ గా పరిగణిస్తారు. తను చెప్పిన తర్వాత… అంపైర్ కూడా ఇదే విషయాన్ని ఇద్దరు బ్యాటర్లకి చెబుతాడు. అలా అందరి అంగీకారంతోనే అలా బౌలింగు వేయాల్సి ఉంటుంది.
Also Read: కిమ్ తో పెట్టుకుంటే అయిపోయేవారు.. ఒలింపిక్ కమిటీపై నెట్టింట జోక్స్
ఈ విషయంలో కమిందు మెండిస్ అయితే ముందుగానే అంపైర్ అనుమతి తీసుకున్నాడని అంటున్నారు. అందువల్ల గొడవ జరగలేదని చెబుతున్నారు. కాకపోతే రెండు చేతులతో గరిటె తిప్పినట్టు, రెండు చేతులతో బౌలింగు చేయడం ఇదే చూడటంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్ లో ఇదే తొలిసారి కావడంతో రచ్చరచ్చ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘వేసింది ఒక ఓవరు.. దీనికే ఇంత బిల్డప్పా?’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇంతకీ మ్యాచ్ లో 10వ ఓవర్ లో ఈ మ్యాజిక్ జరిగింది. ఆ ఓవర్ లో మెండిస్ 9 పరుగులు ఇచ్చాడు. వికెట్ రాలేదు. దీంతో రెండు చేతుల బౌలింగు ఫార్ములా వర్కవుట్ కాలేదు. అయితే తను అండర్ 19కి ఆడేటప్పుడు కూడా ఇలాగే బౌలింగ్ చేసేవాడని తెలిసినవాళ్లు చెబుతున్నారు. మొత్తానికి శ్రీలంక మ్యాచ్ ఓడిపోయినా.. కమిందు మెండిస్ పుణ్యమాని నెట్టింట బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చింది.
శ్రీలంకలో ఇలా బౌలింగు చేయడం అనాదిగా వస్తోంది. స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగ ఇలాగే వెరైటీగా బౌలింగు చేస్తూ వివాదాస్పదమయ్యారు. ప్రస్తుతం వీరి సరసన కమిందు మెండిస్ చేరాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.