Lal Darwaja Bonalu: పాతబస్తీ బోనమెత్తింది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరించారు. ఈ తరుణంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం 116వ వార్షికోత్సవ లాల్ దర్వాజా బోనాల వేడుకలు జరుగుతున్నాయి. అధికారులు బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలో అమ్మవారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
ఈ బోనాల వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహించగా, రెండో రోజు రంగం భవిష్య వాణి, పోతురాజుల ఆటపాటలు కొనసాగనున్నాయి. ఈ మేరకు బోనాల ఉత్సవాల వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతకు ఏర్పాట్లు చేసింది. సుమారు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టింది. అంతేకాదు బోనాలు సమర్పించేందుకు, అమ్మవారి దర్శనానికి 5 క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశారు.
చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక కార్వాన్ వర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, సబ్లీ మండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మీరాలం మండి మహంకాళి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి సీతక్క, నాచారం ఉప్పల్ మహంకాళి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు అక్కన్న మాదన్న ఆలయం నుండి నయాపూల్ వరకు భారీ ర్యాలీ కొనసాగుతుంది. రాత్రి వరకు ఈ ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉంటాయి.