Dog Meat In Bengaluru| బెంగళూరు నగరంలో శుక్రవారం సిటీ రైల్వే స్టేషన్ లో రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రైన్ లో 2700 కేజీల కుక్క మాంసం రవాణా జరిగిందనే వార్త కలకలం రేపింది. సమాచారం తెలియగానే పునీత్ కెరెహళ్లి అనే గో సంరక్షకుడు అక్కడికి తన అనుచరులతో చేరుకొని హంగామా చేశాడు.
పోలీసులు అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకోవడానికి పునీత్, మరో నలుగురిని అరెస్టు చేశారు. ట్రైన్ లో మొత్తం 90 ఇన్ సులేటెడ్ బాక్సుల్లో మాంసం రవాణా జరిగినట్లు సమాచారం.
అయితే ఇతర రాష్ట్రాల నుంచి కుక్క మాంసం పార్సిళ్లో తెప్పించుకొని బెంగుళూరులో అక్రమంగా విక్రయిస్తున్నారని పునీత్, ఇతర రైట్ వింగ్ కార్యకర్తలు ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు ఆ మాంసాన్ని సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించారు. ఆ తరువాత మాంసం రవాణాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కుక్క మాంసం కాదు
బెంగుళూరు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కె శ్రీనివాస్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ”జైపూర్ నుంచి రైలు లో వచ్చింది కుక్క మాంసం కాదని నిర్ధారణ అయింది. ఇది సిరోహి అనే ప్రత్యక జాతి మేక మాంసం. ఆ మేకలకు కూడా పొడవాటి తోకలుండడంతో చూసిన వారు పొరపాటు బడ్డారు. పైగా నగరంలో మటన్ అమ్మకాలు జరుగుతుండగా.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
కానీ నిజానికి బెంగుళూరు నగరంలో ప్రజలకు సరిపడ మటన్ లేదు. 25 నుంచి 30 శాతం తక్కువగా సరఫరా అవుతోంది. అందువల్లే ఈ కొరత తీర్చడానికి మేక మాంసం దిగుమతి చేసుకుంటున్నారు. పైగా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మటన్ ధరలు తక్కువగా ఉండడంతో ఇక్కడ విక్రయించి లాభాలు సంపాదించుకోవడానికి వ్యాపారులు అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో మేకల పెంపకం తగ్గిపోవడంతోనే ఈ సమస్య వచ్చింది.” అని వివరించారు.