Qutb Shahi Heritage Park : హైదరాబాద్ లో ఉన్న వారసత్వ కట్టడాలలో ఒకటైన కుతుబ్ షాహీ టూంబ్స్ ను సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ తో కలిసి పరీశిలించారు. అనంతరం కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలకు హైదరాబాద్ నెలవని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉందన్నారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన, సంస్కృతి, సాంప్రదాయాలతో నిండిన తెలంగాణను శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు పాలించారని గుర్తుచేశారు.
Also Read : కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డికి నివాళుర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
నగరంలో ఉన్న కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులతో పాటు.. వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయం వంటివాటికి తెలంగాణ నిలయంగా మారిందన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయం తెలంగాణలో ఉండటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. శతాబ్దాలుగా హైదరాబాద్ ‘గంగా-జమునా తెహజీబ్’గా పిలువబడుతూ బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని చూసిందని పేర్కొన్నారు.
కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, సెవెన్ టూంబ్స్ ఔట్స్ షాహిన్ రాజవంశం నిర్మాణ నైపుణ్యానికి , సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2013లో MOUతో ప్రారంభించి, 100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణ తో పాటు 106 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనమన్నారు. ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి, ఉదారతకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ ప్రజల తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.