Hezbollah Attacks Israel| ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో అనూహ్య ఘటన జరిగింది. ఎప్పుడూ ఇజ్రెయెల్ దాడిలో వందల మంది పాలస్తీనా ప్రజలు చనిపోవడం చూశాం. కానీ ఈ సారి హెజ్బుల్లా చేసిన బాంబు దాడిలో 11 మంది చిన్నారులు మరణించగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది.
ఇజ్రాయెల్ భూభాగంలోని గోలన్ హైట్స్ ప్రాంతంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. గ్రౌండ్ లో రాకెట్ వచ్చి పడింది. ఈ పేలుడులో 11 మంది పిల్లలు.. అందరూ 10 నుంచి 20 సంవత్సరాలు వయసు వారు చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి లెబనాన్ కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ చేసిందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. కానీ హెజ్బుల్లా గ్రూప్ ఈ దాడి తాము చేయలేదని ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది.
అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై జరిగిన హమాస్ దాడి తరువాత ఇదే అతిపెద్ద దాడి అని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మండిపడుతూ.. ”హెజ్బుల్లా ఈ దాడికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.. ఇప్పటివరకు కనివినీ ఎరుగని రీతిలో హెజ్బుల్లాను శిక్షిస్తాం” అని ఉద్రేకంగా చెప్పారు.
దాడి జరిగిన గోలన్ హైట్స్ ప్రాంతం లెబనాన్ సరిహద్దులకు సమీపంగా ఉండడంతో హెజ్బుల్లా స్థావరాల నుంచి రాకెట్ దాడి జరిగింది.
ఇజ్రాయెల్ మీడియాతో విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కత్జ్ మాట్లాడుతూ.. ”హెజ్బుల్లా అన్ని హద్దులు దాటేసిందనేందుకు ఏ అనుమానం లేదు. మా ప్రతీకారం కూడా అదే రీతిలో ఉంటుంది” అని అన్నారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. గోలన్ హైట్స్ పై దాడి జరిగిందనే వార్త తెలియగానే ఆయన తన పర్యటనని త్వరగా ముగించి తిరిగి వస్తున్నారని సమాచారం. ఆయన పార్టీలోని రైట్ వింగ్ సభ్యులు హెజ్బుల్లాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
గోలన్ హైట్స్ ప్రాంతం 1967లో జరిగిన మిడిల్ ఈస్ట్ యుద్దం తరువాత సిరియాను ఓడించి ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది.
అయితే శనివారం సాయంత్రం గాజాలోని బాలికల పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడిలో 30 మంది పాలస్తీనా పౌరులు చనిపోగా.. 100 మంది గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలు ఒకే రోజు జరగడం గమనార్హం.
Also Read: నీటిపై తేలియాడుతూ ఎప్పుడైనా డిన్నర్ చేశారా?.. ప్రపంచంలో టాప్ టెన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఇవే..