Rs 5.13 cr collected as fine for littering spitting on railway premises
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థగా టాప్ టెన్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక ప్రయాణికులకు చౌకగా వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. దాదాపు 14 లక్షలకు పైగా ఉద్యోగులు రైల్వే శాఖలో పనిచేయడం విశేషం. ప్రయాణికుల సంక్షేమం కోసం రైల్వే శాఖ విప్లవాత్మక మార్పులే తెచ్చింది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా దేశంలోని పలు రైల్వే స్టేషన్లను శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు రైల్వే స్టేషన్ లో శుభ్రత కార్యక్రమాలు జరుగుతుంటాయి. రైల్వే శాఖ ఎంతగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నా కొందరు గుట్కాలు, పాన్ పరాగ్ లు , కిళ్లీలు నములుతూ ఎక్కడికక్కడ ఉమ్మి వేస్తుంటారు.
ఎక్కడికక్కడే చెత్త
మరికొందరు తినడానికి తెచ్చుకున్న వాటిని తిన్నంత తిని స్టేషన్ నడి బొడ్డున అన్నం పారేస్తూ వాళ్లు వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాల తాలూకు చెత్తనంతా అక్కడే వదిలి వెళిపోతుంటారు. ఒక్కోసారి శుభ్రత సిబ్బందితో సైతం గొడవలు పెట్టుకుంటారు. ప్రత్యేకంగా ఎనౌన్స్ మెంట్ మైకులలో కూడా రైల్వే స్టేసన్ ను పరిశుభ్రంగా ఉంచండి అని హెచ్చరిస్తున్నా ప్రయాణికులు పెడచెవిన పెడుతున్నారు. దీనితో లాభం లేదని రైల్వే శాఖ కఠిన మైన జరిమానాలు ప్రయాణికుల నుంచి వసూలు చేయడం ఆరంభించింది అలా ఉమ్మి, చెత్త వేయడం ద్వారా సీసీ కెమెరాలకు చిక్కి జరిమానాలు చెల్లించుకున్నారు ప్రయాణికులు. అలా జరిమానాల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖిత పూర్వకంగా సమర్పించారు. జరిమానాల ద్వారా కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖకు రూ.5.13 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వే మంత్రి తెలిపారు.
భవిష్యత్ లో జరిమానాలు పెంచం
అయితే జరిమానాల మొత్తాన్ని ఇకపై పెంచబోమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. నిరంతరం ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం భవిష్యత్తులో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని అన్నారు. దేశ వ్యాప్తంగా అత్యాధునిక రీతిలో రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం రైల్వే సేవలు విస్తరించామని అన్నారు. ఇంటి వద్దనుంచే టిక్కెట్ పొందేలా యాప్ సిస్టమ్ తీసుకొచ్చామని అన్నారు. స్మార్ట్ రైల్వే స్టేషన్ల కింద రైల్వే స్టేషన్ల భవనాలకు సరికొత్త హంగులతో ఏర్పాట్లు జరుగుతున్నయని అన్నారు. అలాగే ఒంటరిగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల భద్రత కోసం మహిళా ఆర్ పీ ఎఫ్ సిబ్బంది నియామకాలు కూడా జరిగిపోయాయన్నారు. మేరీ సహేలీ పేరిట మహిళలకు రక్షణగా నిలుస్తున్న ఆర్ పీ ఎఫ్ టీమ్ కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయని అన్నారు.