Ponnam Counter to KTR: కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇంకా తాను యవరాజే అనుకుంటున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేదేందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 2 కూడా వస్తుంది..పోతుంది.. కాళేశ్వరంలో ఏం జరిగిందో అందరికీ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. విహార యాత్రకు వెళ్లినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరంకు వెళ్లారన్నారు. రైతాంగాన్ని కాపాడుకుంటామని మంత్రి వివరించారు. అంతేకానీ, హుకుం జారీ చేసేందుకు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేదని మంత్రి పొన్నం గుర్తుచేశారు.
ఇటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు కేంద్రం నుంచి నిధులు ఇప్పించు.. ఆ తరువాత మాట్లాడు అంటూ కిషన్ రెడ్డికి చురకలు అంటించారు. హైదరాబాద్ కు మీరు ఒక్క పైసా అయినా ఇప్పించారా ?అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ. 10 వేల కోట్లను బడ్జెట్లో పెట్టిందన్నారు. పైసా ఇవ్వకుండా తిరిగి ప్రభుత్వ దిష్టి బొమ్మను ఎలా దగ్ధం చేస్తారంటూ ఫైరయ్యారు. గతంలో కూడా కేసీఆర్ మోదీకి అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి.. నీతి ఆయోగ్ మీటింగ్కు వెళ్లలేదని గుర్తుచేశారు. తాము కేంద్ర బడ్జెట్పై తెలంగాణకు జరిగిన అన్యాయంపై నీతి ఆయోగ్ భేటీకి వెళ్లకుండా నిరసన తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని ఆయన చెప్పారు.
Also Read: మా గ్యారంటీల సంగతి సరే.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది..? : భట్టి
ఇదిలా ఉంటే.. ఆగస్టు 2 లోగా కన్నెపల్లి పంప్ హౌజ్లు ప్రారంభించకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గుండె లాంటిదన్నారు. కాళేశ్వరంలో చిన్న సమస్య తలెత్తితే కాంగ్రెస్ దానిని పెద్ద సమస్యగా చూపిస్తున్నదంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పై విధంగా పేర్కొన్నారు.