Congress MP: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బీజేపీ మినహా తెలంగాణలోని అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం కూడా చేసింది. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేసింది. కాగా కొందరు కేంద్రమంత్రులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తెలంగాణకు కూడా నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నేరుగా ప్రధానమంత్రికి ఓ లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ లేఖలో వారు డిమాండ్ చేశారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకురావాలని భావించినట్టు వారు లేఖలో పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ఆధారంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. ఈ పునర్విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇచ్చిందని తెలిపారు. ఆ ఆ హామీలనూ ఏకరువు పెట్టారు. అవి.. ఐటీఐఆర్, ఐఐఎం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తెలంగాణలోని పది జిల్లాల్లో 9 జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
Also Read: అవసరమా బ్రో ఇలాంటి స్టంట్స్.. ప్రాణాలు పోతే ఎవరిది భాద్యత..
అయితే, ఏపీ పునర్విభజన చట్టం కింద చేసిన హామీలు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అమల్లోకి వచ్చాయని ఈ సందర్భంగా ఎంపీలు పేర్కొన్నారు. తమ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు చాలా సార్లు ప్రధానమంత్ర, ఆర్థిక శాఖ మంత్రి, ఇతర సంబంధిత కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పలుమార్లు విజ్ఞప్తులు చేశారని వివరించారు. ఇన్ని చేసినా తెలంగాణ రాష్ట్రానికి తాజా కేంద్ర బడ్జెట్లో ఏమీ కేటాయించలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు చేసినట్టే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని వివరించారు. ఏపీకి ఇచ్చిన హామీలను పూర్తి చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని స్పష్టత ఇచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి లెటర్ హెడ్ పై రాసిన ఈ లేఖపై కాంగ్రెస్ ఎంపీలు అందరూ సంతకాలు పెట్టారు.