Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాపు నేతలైన హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కు లేఖాస్త్రాలు సంధించారు. తొలుత ఆయనకు మద్దతుగా ఉండి.. ఆ తర్వాత విమర్శలు చేశారు. ముఖ్యంగా టీడీపీ కూటమిలో సీట్ల కేటాయింపు సందర్భంలో ఈ విమర్శలు ఎక్కువయ్యాయి. జనసేన పార్టీకి తక్కువ సీట్లు కేటాయించడాన్ని ప్రశ్నించారు. చివరికి వీరి లేఖాస్త్రాలతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు కూడా. కొందరైతే వీరిని జనసేన వ్యతిరేకులని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు.
కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య లేఖ రాశారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
కూటమి ప్రభుత్వానికి కాపు కులస్తులు 99 శాతం ఓట్లేసి గెలిపించారని చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల తమకు న్యాయం జరుగుతుందని 99 శాతం మంది కాపులు కూటమికి మద్దతు పలికారని వివరించారు. ఈడబ్ల్యూఎస్ పది శాతం కోటాలో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ, వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపేశారు.
Also Read: ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్
ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన హైకోర్టులో గతంలో పిటిషన్ వేసిందని, అందుకు విముఖత తెలుపుతూ కోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసిందని హరిరామ జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలగా స్పందిస్తుంది కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తమ సమాజానికి ప్రయోజనం కలిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వివరించారు.