CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ కూడా హైదరాబాద్లో భాగమేనని పేర్కొన్నారు. కాబట్టి, పాతబస్తీలో కూడా మెట్రో నెట్వర్క్ విస్తరిస్తామని వివరించారు. ఇప్పటికే ఎల్ అండ్ టీ అధికారులకు వార్నింగ్ ఇచ్చామని తెలిపారు. పాతబస్తీలో కూడా మెట్రో పనులు మొదలు పెట్టాలని చెప్పామని, ఒక వేళ చేయకుంటే చంచల్గూడ్, చర్ల పల్లి జైలులో ఉంటారని హెచ్చరించామని తెలిపారు. గత ప్రభుత్వం పాతబస్తీకి అన్యాయం చేసిందని విమర్శించారు. పాతబస్తీని కూడా డెవలప్ చేయాలని, అందుకోసం అక్కడ కూడా మెట్రోను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. పాతబస్తీలో మెట్రో పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని, అదే ఒరిజినల్ సిటీ అని రేవంత్ రెడ్డి తెలిపారు. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపనం చేశామని సీఎం స్పష్టం చేశారు. రెండో దశ 78 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామని వివరించారు. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తమదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పాతబస్తీలో మెట్రో నిర్మించే బాధ్యత తమదని చెప్పారు. వచ్చే నాలుగేళ్ల తర్వాత ఓల్డ్ సిటీలో మనం మెట్రోరలో తిరుగుతామని వివరించారు.
Also Read: ఐఫోన్ లవర్స్కు పండగే.. ఇక మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు.. భారీగా తగ్గనున్నధరలు!
హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు రావడానికి తాను కూడా కృషి చేశానని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెట్రో రైలును హైదరాబాద్కు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అది పాతబస్తీకి రాలేదని చెప్పారు. అక్బరుద్దీన్ సాబ్.. మెట్రో రైలు చుక్ చుక్ మంటూ పాతబస్తీకి వస్తుంది అంటూ కేటీఆర్ కబుర్లు చెప్పారని, కానీ, బీఆర్ఎస్ హయాంలో మెట్రో రైలు ఓల్డ్ సిటీకి రానేలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తమ ప్రభుత్వం హయాంలో పాతబస్తీకి మెట్రో రైలు తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎల్ అండ్ టీ అధికారులకు వార్నింగ్ ఇచ్చామని సీఎం తెలిపారు.