Kamareddy Crime: జీవనోపాధి కోసం వాళ్లు పెంచుకున్న గొర్రెలే.. ఆ కుటుంబం పాలిట శాపమయ్యాయి. తండ్రి- కొడుకు పాలిట మృత్యువుగా మారాయి. గొర్రెలను దొంగతనం చేస్తుండగా చూసిన పాపానికి ఓ యువకుడిని భయభ్రాంతులకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించగా.. దొంగతనం విషయం మృతుని తండ్రికి తెలిసి ఉంటుందనే అనుమానంతో.. ఆయన అడ్డు తొలగించారు దుండగులు. ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరి చావుకు గొర్రెల దొంగలు కారణం అయ్యారు. కామారెడ్డి జిల్లాలో గొర్రెల కారణంగా చనిపోయిన తండ్రి,కొడుకుల మిస్టరీ సంచలనం సృష్టించింది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. రెండు నెలల వ్యవధిలో కుమారుడు, ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా తండ్రి హత్యకు గురయ్యాడు. గొర్రెలను మేపేందుకు వెళ్లిన మృతుడు తిరిగిరాకపోవడంతో.. మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు విచారణ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించగా హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు నేరం ఒప్పుకున్నారు. పాతిపెట్టిన శవాన్ని వెలికితీసి నిందితులను కటకటాల వెనక్కి పంపారు పోలీసులు. ఇద్దరి చావుకు గొర్రెల దొంగలు కారణం అంటూ మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్ధులు నిందితులపై మండిపడుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Also Read : డైవోర్స్ అప్లై చేసిందని, కూతురు కాళ్లు నరికిన తండ్రి
వివరాల్లోకి వెళ్తే.. సదాశివగర్ అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన జీర్ల చిన్న మల్లయ్యకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మేకలు-గొర్రెలను మేపుకొంటూ జీవనోపాధి పొందుతోంది ఆ కుటుంబం. రెండు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. మల్లయ్య గొర్రెల పై కన్నేశారు. ఎలాగైనా దొంగతనం చేయాలని స్కేచ్ వేశారు. ఈ క్రమంలో ఓ రోజు గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఇద్దరు వ్యక్తులు గొర్రెలను ఎత్తుకెళ్తుండగా.. మల్లయ్య చిన్న కుమారుడు ప్రవీణ్ చూసి వారించే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్లు పరారయ్యారు. దొంగతనం బాగోతం ఎక్కడ బయట పడుతుందని భావించిన దొంగలు.. ప్రవీణ్ ను భయభ్రాంతులకు గురి చేశారు. మనస్ధాపం చెందిన ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
దొంగతనం విషయం మృతుడు ప్రవీణ్ తండ్రి చిన్న మల్లయ్యకు తెలిసి ఉంటుందని భావించిన ఇద్దరు వ్యక్తులు చిన్న మల్లయ్య అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అదును కోసం వేచి చూస్తుండగా ఈనెల 19న చిన్న మల్లయ్య.. అదే గ్రామానికి చెందిన మేకల కాపరి సాయిలుతో కలిసి గొర్రెలు మేపడానికి వెళ్లాడు. పశువుల కాపరి సాయిలు సహాయంతో ఆ ఇద్దరు దొంగలు మల్లయ్యను హతమార్చారు. ఆ పై పూడ్చి పెట్టారు. మేకలు కాసేందుకు వెళ్లిన చిన్న మల్లయ్య రాత్రి వరకు ఇంటికి తిరిగిరాకపోవడం తో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి విచారణ చేపట్టారు. పాతి పెట్టిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికితీశారు.