India vs Sri Lanka Women’s Asia Cup Final Match 2024: ఆసియా కప్ 2024 లో ఓటమన్నది లేకుండా టీమ్ ఇండియా అమ్మాయిలు ఫైనల్ వరకు చేరుకున్నారు. అంతేకాదు ఓపెనర్లు స్మ్రతి మంధాన, షెఫాలీ రాజ్ అయితే ఇద్దరూ బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నారు. అది భారత్ కి కలిసి వస్తోంది. అలాగే బౌలర్లు కూడా ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ప్రత్యర్థులను తక్కువ స్కోరుకి పరిమితం చేస్తున్నారు. దాంతో బ్యాటర్లకు పని సులువు అవుతోంది. రేపు ఆదివారం దంబుల్లా వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ కి ప్రత్యర్థిగా శ్రీలంక వస్తోంది.
శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఎట్టకేలక మరో బంతి ఉందనగా శ్రీలంక విజయం సాధించి బతుకు జీవుడా అని ఫైనల్ కి చేరుకుంది. నిజానికి పాకిస్తాన్ ఫైనల్ కి చేరుతుందని అందరూ అనుకున్నారు. అప్పుడు ఇండియా-పాకిస్తాన్ మధ్య మరో హై ఓల్టేజీ మ్యాచ్ గా అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.
అయితే పాకిస్తాన్ చివరి వరకు బాగానే ఆడినా విలువైన క్యాచ్ లను నేలపాలు చేయడంతో పరాజయం పాలయ్యారు. శ్రీలంక ఫీల్డింగు కూడా అలాగే ఉంది. వాళ్లు పలు క్యాచ్ లు డ్రాప్ చేశారు. మొత్తానికి ఏమైతేనేం శ్రీలంక విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.
Also Read: కొత్త కోచ్ గంభీర్.. మొదటి మ్యాచ్.. నేడే ఇండియా వర్సెస్ శ్రీలంక టీ 20
టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. గుల్ ఫెరోజా(25), మునీబా అలీ (37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్హరి, ప్రబోధని రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 141 పరుగులు చేసి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (48 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 63) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. పాకిస్థాన్ బౌలర్లలో సదియా ఇక్బాల్(4/16) నాలుగు వికెట్లు తీయగా. నిదా దార్, ఒమైమా సోహైల్ తలో వికెట్ తీసారు.
ఆసియాకప్ 2024 ఫైనల్ వేదికపై భారత్ ఇలాగే కలిసికట్టుగా ఆడి విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం. మన భారత్ అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.