Murder news in annamayya district(Local news andhra Pradesh): అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను అల్లుడు దారుణంగా కడతేడ్చాడు. ఈ ఘటన పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలం నారమాకులపల్లిలో జరిగింది. నారమాకులపల్లికి చెందిన ఆరేటి నీలావతి పెద్ద కుమార్తెకు, చిత్తూరు జిల్లాకు చెందిన అల్లుడికి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తరచూ గొడవ పడడంతో భరించలేని నీలావతి తన కూతురిని పుట్టింటికి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా భార్యభర్తలు దూరంగా ఉంటున్నారు.
నీలావతి పెద్ద కుమార్తె రెడ్డి సుధాకు, అల్లుడు విజయ్ కుమార్ మధ్య ఎన్నికల సమయంలో వివాదం జరిగింది. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో నీలావతి కూతురిని ఇంటి తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టుకుంది. అయితే కొద్ది రోజులుగా విజయ్ కుమార్..అత్తతో వాగ్వాదానికి దిగుతున్నాడు. తన భార్యను కాపురానికి పంపాలని కోరినప్పటికీ అత్త పంపడం లేదు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా, నారమాకులపల్లికి వెళ్లిన విజయ్ కుమార్..మళ్లీ తన భార్యను కాపురానికి పంపాలని కోరాడు. కానీ అత్త ఒప్పుకోలేదు.
అయితే, ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన విజయ్ కుమార్..అత్తను నిలదీశాడు. అయినప్పటికీ అత్త నిరాకరించడంతో చేసేదేమి లేక విజయ్.. పెద్ద కర్రతో అత్తపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో నీలావతి అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికులు అక్కడికి చేరుకొని పరిశీలించగా.. ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: షర్మిల హాట్ కామెంట్స్, జగన్ అక్రమ సంబంధం పెట్టుకోలేదా?
కేవీపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గొడవకు గల కారణాలను ఆరా తీశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నీలావతి పెద్ద కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.