India vs Sri Lanka T20I Match update(Live sports news): టీ 20 ప్రపంచకప్ విజయం తర్వాత, టీమ్ఇండియా జట్టు కొత్త కోచ్ గౌతం గంభీర్ తో కలిసి శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. నేడు అంటే శనివారం రాత్రి 7 గంటలకు క్యాండీలోని పల్లెకెలి స్టేడియంలో తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఎన్నో మార్పులు-చేర్పులు అనంతరం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్సీలో తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది.
ఇక బలాబలాల విషయానికి వస్తే టీమ్ ఇండియాలో ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ రానున్నారు. ఎందుకంటే ఆ ఓపెనర్ ప్లేస్ రోహిత్ శర్మది. అది ఖాళీ అయిపోయింది. అందుకే ఆ ప్లేస్ లో గిల్ కి అవకాశం వచ్చింది. తను నిలకడగా ఆడితే, అది శాశ్వతం అయ్యేలా కనిపిస్తోంది. లేదంటే పక్కన పెట్టిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ వచ్చేలా ఉన్నారు.
మరి ఫస్ట్ డౌన్ కొహ్లీ ప్లేస్ లో ఎవరొస్తారనేది సస్పెన్స్ గా ఉంది. టీ 20 ప్రపంచకప్ లో ప్రయోగాత్మకంగా అమలుచేసిన రిషబ్ పంత్ వస్తాడా? లేక సంజూశాంసన్ వస్తాడా అనేది చూడాలి. మరోవైపు సెకండ్ డౌన్ సూర్యకుమార్ ఉండనే ఉన్నాడు. తర్వాత శివమ్ దుబె లేదా రింకూ సింగ్ వచ్చేలా ఉన్నారు. తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అనంతరం అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇక బౌలర్లలో అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, సిరాజ్, రవి బిష్ణోయ్ లేదా వాషింగ్టన్ సుందర్ వచ్చేలా ఉన్నారు.
Also Read: ఒలింపిక్ గేమ్స్ లో.. బీహార్ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్
శ్రీలంకకి కూడా టీమ్ ఇండియాలాగే కొత్త కెప్టెన్ గా చరిత్ అసలంకను నియమించింది. టీ 20 ప్రపంచకప్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. దీంతో అసలంకను ఎంపిక చేశారు.
తనతో పాటు పాథుమ్ నిశాంక, కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, డాసున్ శనక, వానిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమ సింఘె, మతీశా పతిరణ, నువాన్ తుషార, దుష్మంత, బినూర ఉన్నారు. మరి వీరిలో చివరి 11మందిలో ఎవరుంటారనేది ఆట ముందు వరకు తెలీదు. రెండు జట్లు కూడా కొత్త రక్తంతో వస్తున్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.