Woman Visa Fraud| ఒక యువతి లండన్ వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆశతో తనకు పరిచయం ఉన్న ట్రావెల్ ఏజెంట్ వద్దకు వెళ్లింది. అయితే ఆ ఏజెంట్ లండన్ వీసా కోసం ఆమె వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకొని.. ఆ తరువాత తన బావతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. లుధియానాకు చెందిన మాయ (26, పేరు మార్చబడినది) లండన్ వెళ్లి స్థిరపడాలని, అక్కడే తనకు మంచి భవిష్యత్తు ఉందని నమ్మి నగరంలోని చిన్న ట్రావెల్ ఏజెంట్ జతిందర్ సింగ్ను సంప్రదించింది. జతిందర్ సింగ్ తో ఆమెకు ఇదివరకే పరిచయముంది. అయితే జతిందర్ ఇంతకుముందు దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల వీసాల ఏజెంట్ గా పనిచేశాడు. దీంతో లండన్ వెళ్లేందుకు మాయ అతడిని సంప్రదించింది. జతిందర్ ఆమెను లండన్ పంపించేందుకు ఏడు లక్షలు ఖర్చు అవుతుందని.. చాలా కష్టమని చెప్పాడు.
ఎలాగైనా లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్న మాయ.. అతడి మాటలు నమ్మి అయిదు లక్షలు మాత్రమే ఏర్పాటు చేసింది. మిగతా రెండు లక్షలు సర్దుబాటు కాలేదని జతిందర్ కు తెలిపింది. జతిందర్ ముందుగా ఆమె వద్ద నుంచి అయిదు లక్షలు తీసుకొని.. ఆమెను రెండు లక్షలకు బదులు తనతో శృంగారం చేయమని అడిగాడు. అతని మాటలు విని ఆశ్చర్యపోయిన మాయ.. లండన్ ఎలాగైనా చేరుకోవాలనే ప్రయత్నంలో ఆ తరువాత జతిందర్ షరతులకు అంగీకరించింది.
Also Read: హార్ జైలులో ఖైదీల ఫైటింగ్, అసలేం జరుగుతోంది?
అయితే జతిందర్ ఆ రోజు రాత్రి తనతోపాటు తన బావ మాఖన్ సింగ్ను తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి మాయపై అత్యాచారం చేశారు. ఆ తరువాత మాయను ఉదయమే లండన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. మరుసటి రోజు మాయను తీసుకొని జతిందర్ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బయలుదేరాడు. దారిలో అంబాలా నగరంలో నివసిస్తున్న జతిందర్ తండ్రి చేతికి తన వద్ద ఉన్న అయిదు లక్షలు ఇచ్చాడు. ఆ తరువాత ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాయను వదిలేసి ఆమెచేతికి పాస్ పోర్టు టికెట్లు ఇచ్చి వెళ్లిపోయాడు. కానీ మాయ ఎయిర్ పోర్టు లోపల ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లగానే ఆమె చూపిన వీసా, టికెట్లు నకిలీవని తెలిసింది. దీంతో ఖంగుతిన్న మాయ.. తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకొని.. జతిందర్ సింగ్, అతని బావ మాఖన్ సింగ్ కోసం గాలిస్తున్నారు. ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.