BJP MLA Shreyasi Singh in Paris Olympics(Sports news headlines): ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొంటోందా? ఏమిటిది? అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ అవును.. ఆ అమ్మాయి ఎవరో కాదు 32 ఏళ బీహార్ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్. తను మరెవరో కాదు బీహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. అలాగే తల్లి పుతుల్ సింగ్ ‘బంకా’ నియోజకవర్గం మాజీ ఎంపీగా ఉన్నారు. ఇకపోతే శ్రేయసి జన్మస్థలం బీహార్ లోని గిదౌర్.
ఇక తన తాతయ్య సెరేందర్ సింగ్, తండ్రి దిగ్విజయ్ సింగ్ ఇద్దరూ కూడా నేషనల్ రైఫింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. దీంతో చిన్ననాటి నుంచి కూడా శ్రేయసి సింగ్ కి షూటింగ్ పై ఆసక్తి ఏర్పడింది. చుట్టూ సంపూర్ణ సౌకర్యాలున్నాయి. ఇంక కావల్సింది సాధన మాత్రమే. అందుకే తన పరిధిలోని అడ్వాంటేజెస్ ని అందిపుచ్చుకుని ఎంతో కష్టపడింది.
నీకెందుకు రైఫిల్ షూటింగ్ అంటే వినలేదు. తన కెరీర్ ఇక్కడే ఉందని డిసైడ్ అయ్యింది. అలాగని చదువుని పక్కన పెట్టలేదు. ఢిల్లీలోని హన్స్ రాజ్ కాలేజీ నుంచి ఆర్ట్స్ లో పట్టభద్రురాలయ్యింది. ఆ తర్వాత ఫరీదాబాద్ లోని మానవ్ రచనా యూనివర్శిటీలో ఎంబీఏ చేసింది.
శ్రేయసి 2020లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో బీహార్ లోని జముయ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేపై 41 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. సరే ఇంతవరకు ప్రోఫైల్ బాగానే ఉంది. మరి ఒలింపిక్స్ లో ఎలా అవకాశం వచ్చింది. పొలిటికల్ రికమండేషన్ వల్ల వచ్చిందని అనుకుంటున్నారా? అదేం కాదండీ..
తనకి మొదటి నుంచి రైఫిల్ షూటింగులో శిక్షణ తీసుకుందని అనుకున్నాం కదా…2014లో గ్లాస్గోలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో రజతపతకాన్ని, 2018లో గోల్డ్ కోస్ట్ లో జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. ఈక్రమంలో అర్జున అవార్డు కూడా అందుకున్నారు. మరిన్ని అర్హతలు ఉండబట్టే తను ఒలింపిక్స్ కు ఎంపికయ్యారు.
Also Read: పారిస్ ఒలింపిక్స్ కి ముసుగు వీరుడొచ్చాడు
అయితే తను ఎన్నినైన జముయ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి 1217 కిలో మీటర్ల దూరం ఉంది. అయితే ఢిల్లీలోని ఒలింపిక్ శిక్షణ శిబిరానికి వెళ్లి రావడానికి ఎంతో కష్టపడ్డారు. సామాన్య ప్రయాణీకురాలిగా, ఒక ప్రజాప్రతినిధిగా రైలులోనే ఢిల్లీ వెళ్లేవారు. అలాగని ఆటల్లో పడి నియోజకవర్గాన్ని వదిలేయలేదు. ప్రస్తుతం జముయ్ ప్రగతి బాటలో పయనిస్తోంది. ఒక ఆదర్శ నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంటోంది.
మరి ఇంత ప్రతిభ ఉన్న యువ క్రీడాకారిణి, ఒక ప్రజాప్రతినిధి నేడు ఒలింపిక్స్ లో పాల్గొనడం చాలా గొప్ప విషయంగా పరిగణించాలి. అన్నింటా విజయపతాకం ఎగురవేసిన శ్రేయసి సింగ్ ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించి దేశానికి పేరు తీసుకురావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెబుదాం.