YS Sharmila hot comments on Jagan(AP political news): ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసినా నేతల మధ్య మాటల వేడి ఇంకా కంటిన్యూ అవుతోంది. అధికార కూటమి -వైసీపీ – కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా వైసీపీ అధినేత జగన్పై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.
వైసీపీ అధినేత జగన్ మూడురోజుల కిందట ఢిల్లీలో మహాధర్నా చేపట్టారు. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు హాజరయ్యాయి. కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఎవరూ రాలేదు కూడా. దీనిపై శుక్రవారం ప్రెస్మీట్లో రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలన్నారు వైఎస్ షర్మిల. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఐదేళ్లుపాటు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులు కాలరాయలేదా? అంటూ దుమ్మెత్తిపోశారు.
చివరకు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టిందెవరన్నారు షర్మిల. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు, అక్కడి పరిస్థితులు మీకు గుర్తుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురిచేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చింది మీరు కదా? వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా?
ALSO READ: లక్షల ఎకరాలు కబ్జా.. పెద్దిరెడ్డి అనుచరుడు అరెస్ట్
మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే.. మీ నుంచి కనీసం సంఘీభావం లేదన్నారు వైఎస్ షర్మిల. మీ నిరసనలో నిజంలేదని, స్వలాభం తప్పా, రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందన్నారు. ‘సిద్దం’ అన్నవాళ్లకు 11 మంది బలం సరిపోలేదా, ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారని సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు వైఎస్ షర్మిల. మరి దీనిపై జగన్బాబు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.