Minister Ponnam prabhakar comments(Telangana politics): కేంద్ర బడ్జెట్లో విపక్షాలకు అన్యాయం జరిగిందని, అందుకే నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదని చెబుతుంటే..బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగలబెట్టడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఒక్క పైసా కూడా తీసుకురాలేదని, కానీ తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి రూ.10వేల కోట్లు కేటాయించిందన్నారు.
కేంద్రం నుంచి నిధులు తెప్పించు అని కిషన్ రెడ్డికి మంత్రి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, గతంలోనూ టూరిజం మంత్రిగా ఉన్న ఆయన ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
అలాగే విభజన హామీలకు సంబంధించిన సమస్యలను బీజేపీ ప్రభుత్వం పరిష్కారించాలని మంత్రి గుర్తు చేశారు. కేంద్రం హైదరాబాద్కు ఏం ఇస్తుందో కిషన్ రెడ్డి తెలపాలన్నారు. బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించాడు. ఇక, ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలోనే పూర్తి అయిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరగకపోవడంతోనే రాష్ట్రానికి నష్టం జరిగిందని వెల్లడించాడు.
Also Read: తెలంగాణ ‘బండి’ అప్పులతో నడవాల్సిందేనా?
కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని, ప్రభుత్వానికి ఆయన ఇచ్చేంది ఏందని మంత్రి అన్నారు. కాళేశ్వరంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. విహార యాత్రలకు వెళ్లినట్లు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్తున్నారని, రైతాంగాని కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.