CM Reventh Reddy latest news(Telangana news today):
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో విజయభేరి మోగించిన కాంగ్రెస్ సమరోత్సాహంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతోంది. అసాధ్యం అనుకున్న రైతు రుణమాఫీని చేపట్టి అందరితోనూ శబాష్ అనిపించుకుంటోంది. మరో పక్క ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కుంటోంది. మొన్నటి బడ్జెట్ తో తెలంగాణకు జరిగిన నష్టంపై కేంద్రంపై పరోక్ష యుద్ధాన్ని ప్రకటించింది. అన్నీ బాగానే జరుగుతున్నా సొంత పార్టీలో నేతలు మాత్రం కొందరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం
గత నెలలో క్యాబినెట్ విస్తరణకు డేట్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఐదు రోజులు ఢిల్లీలో మకాం వేసి పీసీసీ అధ్యక్ష నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించినట్లు సమాచారం. అయితే అవేమీ జరగలేదు. కారణం ఏది ఏకమైనప్పటికీ ఆషాఢం సెంటిమెంట్ కూడా అడ్డొచ్చింది. ఇక రాబోయేది శ్రావణ మాసం. ఏ పని చేయాలన్నా మంచి కాలం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఆగస్టు 15 తర్వాత పాలన పరిగెత్తిద్దామని అనుకుంటున్నారని సమాచారం. అందులో భాగంగానే క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక వంటి కీలక నిర్ణయాలతో సహా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కులగణన వంటి వి కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడున్న 33 జిల్లాలను తగ్గించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ ప్రక్రియ కూడా ఆగస్టు 15తో పూర్తవుతుంది. సర్కారు కాస్త ఊపిరి తీసుకోవచ్చు. అప్పుడు పార్టీ పరంగా పలు కీలక మార్పులు చేయనున్నారని తెలుస్తోంది.
క్యాబినెట్ విస్తరణలో భాగంగా మరో అరుగురికి పదవులు లభించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులలో కొందరికి స్థానచలనం తప్పదని అనుకుంటున్నారు. దీనితో ఎవరైపై వేటు పడనుందో అని ఆందోళన పడుతున్నారు కొందరు మంత్రులు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో 12 ఎంపీ స్థానాలు వస్తాయని అనుకున్న కాంగ్రెస్ కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఏ ఏ స్థానాలలో ఓడిపోయామో అక్కడి అసెంబ్లీ మంత్రులు ఇన్ ఛార్జిలుగా ఎలా పనిచేశారో వారిపై ప్రజా వ్యతిరేకత ఏదైనా ఉందా అనే కోణంలో నివేదికలు సిద్ధం అయ్యాయి. ఆ నివేదికల ఆధారంగానే కొంత మంది మంత్రులపై వేటు ఉండబోతోందని సమాచారం.
రాహుల్ వస్తున్నారా?
ఇక పీసీసీ రేసులో ఈ సారి చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఏకాభిప్రాయ ఎన్నిక లేనట్లే కనిపిస్తోంది. వీరిలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలా అనేది ఇప్పటికే కేంద్రం నిర్ణయించేసినట్లు సమాచారం. అది కూడా రేవంత్ నోటితో చెప్పించాలని అధిష్టానం భావిస్తోంది. ఆగస్టు 15 తర్వాత రాహుల్ గాంధీని తెలంగాణకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రుణ మాఫీని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఐదు లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వలనే ఇదంతా సాధ్యపడింది అని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రేవంత్ సభను వరంగల్ లో ఏర్పాటు చేసే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి నేతలకు జన సమీకరణ బాధ్యతలు అప్పజెప్పిన సీఎం రేవంత్ ఎలాగైనా సరే రైతుల బహిరంగ సభను సక్సెస్ చేయించి అధిష్టానాన్ని మెప్పించాలనని చూస్తున్నారు.