YS Jagan comments on Sharmila(Political news in AP): ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయి.. ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా బయటికి వలస వెళ్లడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్య 151 నుంచి 11కు పడిపోవడంతో ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేదు. మరో ఐదేళ్లపాటు పార్టీని నడపాలంటే.. నాయకులను కాపాడుకోవాలంటే జగన్కు కత్తి మీద సామే అని చర్చిస్తున్నారు.
ఢిల్లీలో ఆందోళన చేసిన తరుణంలో వైసీపీ.. కాంగ్రెస్ కూటమిలో చేరుతుందనే చర్చ కూడా మొదలైంది. ఎన్డీయే కూటమిలో ఇప్పటికే అధికార టీడీపీ చేరింది. ఇప్పుడు వైసీపీ ఒంటరిగా ఉండాలి.. లేదంటే ఇండియా కూటమిలో చేరాలి. ఢిల్లీలో జగన్ చేసిన ఆందోళనకు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలుపడంతో.. వైసీపీ త్వరలోనే కాంగ్రెస్ కూటమిలో చేరబోతున్నట్టు ప్రచారం ముమ్మరమైంది. ఆ వెంటనే సజ్జల ఆ వార్తలను ఖండించినప్పటికీ చర్చ ఆగలేదు.
తాజాగా, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ పైనే విమర్శలు కురిపించారు. తాము ఢిల్లీలో చేసిన ఆందోళనకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించామని వివరించారు. కానీ, ఈ నిరసనకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. ఎందుకు రాలేదో వారినే అడగాలన్నారు. వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీ పైనే మండిపడ్డా.. ఆయన చేసిన వ్యాఖ్యలు చెల్లి షర్మిలను ఉద్దేశించే చేశారని కామెంట్లు వస్తున్నాయి. ఇలా షర్మిలను పరోక్షంగా విమర్శించడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహించిన వైఎస్ జగన్ తమ పార్టీ ఆ కూటమిలో కలవడం లేదని దాదాపు స్పష్టత ఇచ్చారు.
Also Read: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ.. జులై 30కి వాయిదా
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపైనా వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు ఏపీ కాంగ్రెస్తో సంబంధాలు నెరుపుతున్నారని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ను దగ్గరగా ఉంచుకోవడానికి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉపయోగించుకుంటున్నారని, రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్దో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.