MLAs Disqualification Case: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన ఫిటిషన్పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌషిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. బీఆర్ఎస్, తరపున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు.
స్పీకర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టు తీర్పులో ఉన్నా అమలు చేయలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ఈ మేరకు పలు మార్లు కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా చదివి వినిపించారు. వాదనల విన్న కోర్టు జులై 30 వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
నేతల వలసలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో గులాబీ పార్టీకి ఇది సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ బద్ధంగా ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. చట్టపరంగా అనర్హత వేటు పడేలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఇతర శాసన సభ్యులు పార్టీని వీడకుండా కట్టడి చేయవచ్చని పార్టీ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్, తెల్లం వెంటట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు భవిష్యత్తులో ఇంకెవరైనా పార్టీని వీడినా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.