Police Informer: కొన్ని సార్లు మరణించిన దేహాలు కూడా కీలక విషయాలను వెల్లడిస్తాయి. హత్యకు గురైన ఓ పోలీసు ఇన్ఫార్మర్ డెడ్ బాడీ కూడా ఇలాంటి వివరాలనే పోలీసులకు తెలిపింది. మిత్రుల కంటే శత్రువులను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలని చెబుతారు. ఈ పోలీసు ఇన్ఫార్మర్ ఏకంగా తన శత్రువులను రెప్పపాటు కూడా మరిచిపోవద్దని అనుకున్నాడో ఏమో.. ఏకంగా తన తొడపై టాటూగా వారి పేర్లు రాసుకున్నాడు. 22 మంది శత్రువుల పేర్లను తన కుడి కాలి తొడకు టాటూ వేయించుకున్నాడు. తనకు జరగరానిది జరిగితే వీరిని అనుమానించాలనీ ఆ టాటూలో సూచన చేశాడు. అంతేకాదు, 2014 నుంచి అతను ఓ డైరీ రాశాడు. బ్యాడ్ డే అయితే రెడ్ ఇంక్తో వివరాలు రాసుకోగా.. గుడ్ డే అయితే గ్రీన్ ఇంక్తో రాసుకున్నాడు. ఇక నార్మల్ డే అయితే సాధారణ బ్లూ ఇంక్తో తన డైరీ రాసుకున్నాడు. ఇంతకీ ఎవరా పోలీసు ఇన్ఫార్మర్? ఎలా హతమయ్యాడు? ఆ శత్రువులే చంపారా? పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు? వంటి వివరాలను తెలుసుకుందాం.
ఎవరితను?
ముంబయిలోని వైల్ పార్లెలో నివసించే వాగ్మేర్ను పోలీసులు సరదాగా చుల్బుల్ పాండే అని పిలుచుకునేవారు. పోలీసులకు కొన్ని సార్లు ఇన్ఫార్మర్గా పని చేసిన వాగ్మేర్ స్వయంగా నేరాలు చేశాడు కూడా. ఆయనకు 24 ఏళ్ల కొడుకు. గత 15 ఏళ్లుగా తనను తాను స్వయంగా ఒక ఆర్టీఐ యాక్టివిస్టు అని చెప్పుకునేవాడు. ముంబయి, నవి ముంబయి, థానే ప్రాంతాల్లో ఉండే స్పాలను టార్గెట్ చేస్తూ ఆర్టీఐలు దాఖలు చేసేవాడు. లోసుగులను పట్టుకుని ఆ స్పా యజమానులను వేధించేవాడు. డబ్బు వసూలు చేసేవాడు. ఈ విషయాలను తన డైరీలో కూడా పేర్కొన్నాడు. వాగ్మేర్పై ఎనిమిది ఎఫ్ఐఆర్లు, రేప్, ఎక్స్టార్షన్ వంటి నాన్ కాగ్నిజేబుల్ కేసులు 22 ఉన్నాయి. తనకు శత్రువులు జాస్తి అని తెలిసే ముందుగానే తన తొడపై శత్రువుల జాబితాను టాటూ వేసుకున్నాడు.
ఎలా హత్యకు గురయ్యాడు?
జులై 17వ తేదీన ఆయన 50వ పుట్టిన రోజు. బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం మంగళవారం రాత్రి సియన్లోని ఓ బార్లో తన శత్రువుల లిస్టులో ఉన్న సంతోష్ షెరికర్కు చెందిన స్పాలో పని చేసే ముగ్గురికి పార్టీ ఇచ్చాడు. ఇందులో 24 ఏళ్ల మహిళ వాగ్మేర్ ఫ్రెండ్. ఈ ముగ్గురిని వాగ్మేర్ తన కారులో స్పాకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మేనేజర్, మరో ఉద్యోగి వారి ఇంటికి వెళ్లిపోగా.. వాగ్మేర్, తన ఫీమేల్ ఫ్రెండ్ స్పాలోనికి వెళ్లారు. అర్ధరాత్రి దాటి సమయం సుమారు 1.30 గంటలు అవుతున్న వేళ దుండగులు ఆ స్పాలోకి చొరబడ్డారు. ఆ మహిళను ఓ రూమ్లో బంధించి వాగ్మేర్ను పలుమార్లు పొడిచారు. గొంతు కోశారు. అరగంట తర్వాత అక్కడి నుంచి వారు పరారైనట్టు క్రైమ్ బ్రాంచీ అధికారి ఒకరు తెలిపారు.
Also Read: ఆగస్టులోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు: సీఎం రేవంత్ రెడ్డి
చంపిందెవరు?
వాగ్మేర్ బెదిరింపులకు మళ్లీ మళ్లీ డబ్బులు ఇచ్చుకోలేక స్పా ఓనర్ సంతోష్లో కోపం రగులుకుంది. సంతోష్ షెరికర్ ఇటీవలే మొహమ్మద్ ఫిరోజ్ అన్సారీ(26)ని కలిశాడు. వాగ్మేర్ వేధింపులకు ఓ పరిష్కారం చూడాలని, కావాల్సిన సొమ్ము తాను సమకూర్చుతానని చెప్పాడు. రూ. 6 లక్షల బేరం కుదిరిందని, అందులో రూ. 4 లక్షలు అప్పటికే అందాయని పోలీసులు తెలిపారు. వాగ్మేర్ను లేపేయడానికి ఫిరోజ్ రెడీ అయ్యాడు. ఫిరోజ్ ఇక్కడ కేవలం కిరాయి గూండా మాత్రమే కాదు.. ఆయన కూడా స్వతహాగా ఓ స్పా ఓనర్. వాగ్మేర్ బెదిరింపులకు గురై డబ్బులు సమర్పించుకున్నవాడే. ఫిరోజ్కు కూడా వాగ్మేర్ పై కోపం ఉన్నది.
సంతోష్తో డీల్ సెట్ అయ్యాక ముంబయిలోని నలసొపారాకు చెందిన షకీబ్ అన్సారీ(28)కి కాల్ చేశాడు(హత్య జరగడానికి పది రోజుల ముందు). వాగ్మేర్ను ఫాలో కావాలని ఆదేశించాడు. వీరిద్దరూ కలిసి కత్తెరలను కొనుక్కుని వాటిని రెండుగా విడదీశారు. ఒక భాగాన్ని వాగ్మేర్ను పొడవడానికి మరో భాగాన్ని గొంతు కోయడానికి ఉపయోగించారని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ తెలిపారు.
బార్ నుంచి స్పా వరకు వాగ్మేర్ కారును ఫిరోజ్, షకీబ్ ఫాలో అయ్యారు. స్పాలో వాగ్మేర్ను చంపేశాక కాందివలిలోని స్పాకు వెళ్లారు. అక్కడ వారి రెయిన్కోట్లు, షూస్ తీసేసి కత్తెర్లను పడేశారు. స్కూటర్ కూడా వదిలిపెట్టేశారు. అక్కడి నుంచి వారు నలసొపారాకు వెళ్లారు. నలసొపారా నుంచి షకీబ్, మరో ఇద్దరు(వీరి పాత్ర ఏమిటో తెలియాల్సి ఉన్నది) కలిసి విరార్లో గరిబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీకి బయల్దేరినట్టు క్రైమ్ బ్రాంచ్ డీసీపీ దత్తా నలవాడే వివరించారు.
Also Read: తెలంగాణలో పేలిన తూటా.. ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
పోలీసులు షెరీకర్, ఇద్దరు దుండుగులు మొహమ్మద్ ఫిరోజ్ అన్సారీ, షకీబ్ అన్సారీలను పోలీసులు గుర్తించారు. వీరితోపాటు మరో ఇద్దరు అనుమానితులను కూడా రాజస్థాన్లోని కోటాలో అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ జరిగే సమయంలో ఈ ఇద్దరు నిందితులతో ఫోన్లో టచ్లోనే ఉన్నారు.
నిందితులను ఎలా పట్టుకున్నారు?
సియాన్ బార్ వద్ద రెయిన్ కోట్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తచ్చాడుతున్నట్టు సీసీటీవీలో పోలీసులకు కనిపించింది. ఆ తర్వాత వారిద్దరూ వాగ్మేర్ కారును ఫాలో అయినట్టూ కనిపించింది. అందులో ఒకరు ఓ పాన్ షాప్ వద్ద ఏదో కొనుక్కుని జీపే ద్వారా డబ్బులు చెల్లించాడు. ఆ షాప్ ఓనర్ వద్దకు వెళ్లి ఆ జీపే వివరాలు కనుక్కున్నారు. తద్వార ఫిరోజ్ను పట్టుకోగలిగినట్టు డీసీపీ నలవాదె తెలిపారు.
సియాన్ బార్ సమీపంలోని మొబైల్ ఫోన్ లొకేషన్, వర్లీలోని స్పా వద్ద లొకేషన్ ఆధారంగా మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డులను క్రైమ్ బ్రాంచ్ టీం సంపాదించింది. సంతోష్ షెరికర్కు ఆయన కాల్స్ను కూడా కనుగొన్నారు. ఫోన్ చేస్తే నలసొపారాలో ఉండి ఫిరోజ్ కాల్ లిఫ్ట్ చేశాడు.
Also Read: Samsung Galaxy S25 Ultra: ఇది మీరు చూడాలి.. సామ్సంగ్ కొత్త ఫోన్.. అంతకుమించి ఉంటుంది!
ఫిరోజ్ను అరెస్టు చేసి విచారించగా ఈ నేరంలో పాల్గొన్న ఇతరుల వివరాలను చెప్పాడు. ఆ వివరాల ఆధారంగా షకీబ్ను పోలీసులు అరెస్టు చేశారు. వాగ్మేర్ ఫీమేల్ ఫ్రెండ్ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరింత మంది నిందితులను పోలీసులు త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నది.