Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో తేజ్ పేరు సినిమాలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ వినిపిస్తుంది. సినిమాల విషయం పక్కన పెడితే.. తేజ్ మంచి మనసును నెటిజన్స్ కొనియాడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక తండ్రీకూతుళ్ల వీడియోపై అసభ్యకరమైన జోక్స్ వేసిన ప్రణీత్ హన్మంతు గురించి లోకానికి తెలియజేశాడు. తేజ్ పూనుకోవడం వలనే ప్రణీత్ లాంటివారు జైలుకు వెళ్లగలిగారు.
ఇక ఇప్పుడు తేజ్ మరోసారి తన గొప్పమనసును బయటపెట్టాడు. సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆదుకొనేవారు లేక, సహాయం చేసేవారు లేక, చేతిలో డబ్బు లేక అల్లాడిపోతోంది. మొన్నీమధ్య ఒక షోకు వచ్చిన ఆమె తన ఆర్థిక కష్టాలను ఏకరువు పెట్టింది.
ఇక తాజాగా సాయి ధరమ్ తేజ్.. పావలా శ్యామల కష్టాన్ని అర్ధం చేసుకొని.. ఆమెకు ఆర్థిక సహాయం చేశాడు. ఆమెకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తేజ్ గురించి పావలా శ్యామల మాట్లాడుతూ.. ” కరోనా సమయంలో సాయి ధరమ్ తేజ్ గారు.. ఒకసారి ఫోన్ చేసి నేను వస్తానమ్మా.. మీరేం బాధపడకండి. నేను చూసుకుంటాను అని చెప్పాడు. నేను షూటింగ్ లో ఉన్నాను.. మీరేమి బాధపడకండి.. మీరు జీవితాంతం బాధపడకుండా ఉండేలా చూసుకుంటాను అని మాట్లాడాడు. ఆ తరువాత ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది. ఆయన బతకాలని నేను ఎంతగానో కోరుకున్నాను.
ఇప్పుడు ఆయన కోలుకున్నాకా ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని నాకు డబ్బు పంపించారు. ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలి” అని తెలిపింది. ఆ తరువాత తేజ్ తో వీడియో కాల్ మాట్లాడి ఎమోషనల్ అయ్యింది. మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇంతలా సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు తేజ్ గొప్ప మనస్సును ప్రశంసిస్తున్నారు.