Payyavula Keshav comments on Jagan(Andhra politics news): ఇండియా కూటమి నేతలతో చర్చలు జరిపేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్కు దమ్ముంటే హత్యలకు సంబంధించిన వివరాలను బయట పెట్టాలని అన్నారు. బయట చెబుతున్న విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలు జగన్కు ఓట్లు వేసి.. 11 సీట్లు ఇచ్చింది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసమని అన్నారు. కానీ జగన్ సింగిల్ కెమరాలతో ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అభిమానులు, అవమానించేవారు ఉండటం సహజమని అన్నారు. అభిమానించినా, అవమానించినా నిలదోక్కుకున్న వాళ్లే రాజకీయాల్లో ఉండగలన్న విషయాన్ని గ్రహించాలని జగన్కు హితవు పలికారు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే 11 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా ఒంటరిగా మిగిలిపోతారని అన్నారు.
ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేని సభలో చేతులెత్తేసిన జగన్.. ప్రతపక్ష హోదా కావాలని కోర్టులో అడుగుతున్నారని అన్నారు. అసెంబ్లీలో అడగాల్సినవి ఢిల్లీలో అడుగుతున్నారని విమర్శించారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసం ఢిల్లీకి వెళ్లానని ధైర్యంగా చెప్పొచ్చు కదా.. అని తెలిపారు. శ్వేతపత్రంలో చూపించిన విధంగా రూ. 9.30 లక్షల కోట్ల అప్పు కచ్చితంగా పెరుగుతుందని తెలిపారు.